హైదరాబాద్: భారత గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తం 106 మందిని ఎంపిక చేసింది. వీరిలో 9 మందికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రముఖలు ఉన్నారు.
ఆధ్యాత్మిక విభాగంలో తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు చినజీయర్ స్వామి, కమలేశ్.డి.పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. గుజరాత్కు చెందిన కమలేశ్.డి.పటేల్.. హైదరాబాద్లో రామచంద్ర మిషన్ను నిర్వహిస్తున్నారు.
తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యుడు పసుపులేటి హన్మంతరావు, శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్తా, భాషావేత్త బి.రామకృష్ణా రెడ్డిలు పద్శ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
పలు రంగాల్లో తమ జీవిత కాలంలో చేసిన విశిష్ఠ సేవల ద్వారా భారత ప్రభుత్వ పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా అభినందనలు తెలిపారు.
కాగా, ఏపీ నుంచి ప్రముఖ సాంకేతిక ఇంజనీర్లు గణేశ్ నాగప్ప కృష్ణరాజన్న, అబ్బరెడ్డి నాగేశ్వరరావు, ఏటికొప్పాకకు చెందిన కొయ్య బొమ్మల కళాకారుడు సీవీ రాజు,, ప్రముఖ హరికథా విద్యవాంసులు కోట సచ్చిదానంద శాస్త్రి, ప్రముఖ సామాజికవేత్త సంకురాత్రి చంద్రశేఖర్, విద్యావేత్త ప్రకాశ్ చంద్ర సూద్, ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.