హైదరాబాద్ : ఈ నెల 13న జరగాల్సిన తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ 2023 వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సి.మురళీకృష్ణ తెలిపారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 13న నిర్వహించాల్సిన సెట్ పరీక్షను 17కి మార్చింది ప్రభుత్వం. సెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 10న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే 14, 15 తేదీల్లో నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కెమికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జాగ్రఫీ, హిందీ, లింగ్విస్టిక్స్, సంస్కృతం, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీషు పరీక్షలను మార్చి 13న షెడ్యూల్ చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత పరీక్షగా ‘టీఎస్ సెట్’ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయి. గత డిసెంబర్ 30 నుంచి ఈ పరీక్ష కోసం ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పూర్తి కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. టీఎస్ సెట్ కోసం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్సైట్ సంప్రదించాలి.
ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన పత్రిక ప్రకటన కింద ఇవ్వబడిన లింకులో చదువుకోవచ్చు.