అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు మంగళవారం తీర్పు ఇచ్చారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి నిన్న మధ్యాహ్నం ఆయన విడుదలయ్యారు.
బెయిల్ ఉత్తర్వుల్లో ఐదు షరతులను పేర్కొన్న ధర్మాసనం, సిఐడి దాఖలు చేసిన మెమోను పరిశీలించిన అనంతరం మరికొన్ని షరతులను చేర్చింది. తొలుత పేర్కొన్న షరతుల ప్రకారం కేసు విచారణ చేస్తున్న విజయవాడ ఎసిబి కోర్టులో లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలి. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవచ్చు.
సరెండర్ అయ్యే సమయంలో చికిత్సతో పాటు ఆస్పత్రి వివరాలను జైలు సూపరింటెడెంట్కు సీల్డ్ కవర్లో సమర్పించాలి. ఆ కవర్ను జైలు సూపరింటెండెంట్ ఏసీబీ కోర్టుకు నివేదించాలి. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసు విచారణను ప్రభావితం చేసే ఎటువంటి పనులను చేయకూడదు. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎదుట లంగిపోవాలని 16 పేజీల ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.
ప్రధాన బెయిల్ పిటిషన్పై 10వ తేదీన విచారణ చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆయన వెంట ఇద్దరు సిఐడి డిఎస్పిలు ఉండేందుకు అనుమతించాలంటూ సిఐడి చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
బాబు కుటుంబసభ్యులు లోకేష్, బ్రహ్మణీ, బాలకృష్ణలతో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు ఆయనకు జైలు వద్ద స్వాగతం పలికారు. కార్యకర్తల నుద్దేశించి కొద్దిసేపు మాట్లాడిన అనంతరం చంద్రబాబు రాజమహేంద్రవరం నుండి అమరావతికి రోడ్డుమార్గంలో చేరుకున్నారు.
ఆరోగ్య సమస్యల కారణంగానే బెయిల్
ఆరోగ్య సమస్యల కారణంగానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్ను వ్యతిరేకిస్తూ సిఐడి చేసిన వాదనలను ఆయన తోసిపుచ్చారు. ‘గత జూన్ 21 నుంచి ఆరు నెలల్లోగా కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని చంద్రబాబు వైద్యులు సిఫార్సు చేశారు. ఆపరేషన్ కోసమే బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. ఆయన వయసును కూడా పరిగణనలోకి తీసుకున్నాం, వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు సహజం. దీనికి మెడికల్ బోర్డు ఎదుట హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సిఐడి చేసిన వాదన ఆమోదయోగ్యంగా లేదు.
నిందితులపై నేరారోపణల తీవ్రత కంటే వాళ్ల ఆరోగ్యం ముఖ్యం. దర్యాప్తులో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే బాబు ఉన్నారు. పిటిషనర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు బెయిల్ మంజూరుకు యోగ్యులు. బెయిల్ మంజూరు చేసినప్పటికీ న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకునే ఆస్కారం ఏమాత్రం లేదు. సీఎంగా చేశారు. విపక్ష నేతగా ఉన్నారు, ప్రజలతో గట్టి సంబంధాలు ఉన్న వ్యక్తి . దేశం విడిచి పారిపోతారనేందుకు అస్కారమే లేదు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే 4 వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తున్నాం.’ అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.