అమరావతి: టీడీపీ-జనసేన తొలి జాబితా నేడు విడుదల కానుంది. మాఘ పౌర్ణమి కావడంతో చంద్రబాబు నివాసంలో తొలిజాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లతో సమావేశం నిర్వహించి.. తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. వంద అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని తెలిసింది.
మొదటి జాబితాలో 65 మంది అభ్యర్థుల పేర్లు ఉండవచ్చని, ఇందులో 15 మంది జేఎస్పీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయని తెలిసింది. కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అచ్చన్నాయుడు, మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెనాలిలో జేఎస్పీ పీఏసీ చీఫ్ నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
కాగా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రెండు రోజుల్లో టీడీపీలో చేరనున్నారు. ఆయనను నరసరావుపేట లోక్సభకు పోటీకి దింపేందుకు టీడీపీ హైకమాండ్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
పార్టీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు… టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ తో సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన తరుణంలో ఈ భేటీపై ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలో ఏ నియోజకవర్గాలు, ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా(First list)ను ప్రకటించనున్నారు.