అమరావతి: గృహ విద్యుత్తు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏకంగా ఒక్కసారే రూ.1400 కోట్ల భారాన్ని మోపింది. పైగా ముందు చెప్పినట్లుగా ఆగస్టు నుంచి కాకుండా ఏప్రిల్ నుంచే ఛార్జీలను పెంచుతోంది. దీనికి అదనంగా సర్దుబాటు (ట్రూ అప్) పేరుతో మరో మోత మోగించనుంది. వాటిని నెలవారీ వాయిదాల్లో అదనంగా వసూలు చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సర విద్యుత్తు ఛార్జీల వివరాలను బుధవారం తిరుపతిలో ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సభ్యులు టి.రాంసింగ్, పి.రాజగోపాల్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు ఛార్జీల పెంపు అనివార్యమని పేర్కొన్నారు. డిస్కంలను బలోపేతం చేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. 20 ఏళ్లుగా వినియోగదారులపై ఎక్కడా భారం మోపలేదని వెల్లడించారు. 75 యూనిట్ల వినియోగ టారిఫ్ ఇప్పటికీ సరఫరా వ్యయంలో 50% కంటే తక్కువే ఉందని, పేద వినియోగదారుల కోసం 0-30 యూనిట్ల కొత్త శ్లాబు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపుదలతో పంపిణీ సంస్థలకు దాదాపు రూ.1400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని వెల్లడించారు. వినియోగదారులకు రూ.11,123 కోట్ల రాయితీని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
యూనిట్లపై విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచారంటే..
30 యూనిట్ల వరకు యూనిట్ కు 45 పైసలు పెంపు.
31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంపు.
75 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు 1.40 రూపాయలు పెంపు.
126యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు 1.57 రూపాయలు,
226యూనిట్ల నుంచి 400యూనిట్ల వరకు 1.16 రూపాయలు
400యూనిట్లకుపై బడిన వాళ్లకు 55పైసలు చొప్పున పెంపు ఉంటుంది.