కైరో: పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కాబోతున్న వేళ ఇజ్రాయెల్, పాలస్తీనా ఈజిప్ట్లో జరిగిన సమావేశంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశాయి. ఆక్రమిత ప్రాంతాల్లో “హింసను అరికట్టడానికి” కలిసి పనిచేస్తామని ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ ప్రతినిధులు ఒక నెలలోపు రెండుసార్లు సమావేశమయ్యారు, ప్రాంతీయ మిత్రదేశాలు ఈజిప్ట్, జోర్డాన్, అలాగే యునైటెడ్ స్టేట్స్ దేశాల సహకారంతో సంవత్సరం పాటు కొనసాగిన హింసాకాండకు ముగింపు పలికారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో ఇప్పటికే 200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. అదే సమయంలో పాలస్తీనా దాడుల్లో 40 మందికి పైగా ఇజ్రాయిలీలు లేదా విదేశీయులు మరణించారు.
షర్మ్ ఎల్ షేక్ నగరంలో ఈజిప్షియన్ రెడ్ సీ రిసార్ట్లో ఆదివారం జరిగిన శిఖరాగ్ర సమావేశం తరువాత.. ఇరుదేశాలు హింసను తగ్గించడానికి ఒప్పుకున్నాయని ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటిస్తామని కూడా ఇరు పక్షాలు తెలిపాయి. ఇజ్రాయెల్ నాలుగు నెలల పాటు కొత్త సెటిల్మెంట్ నిర్మాణంపై చర్చను నిలిపివేస్తానని అనధికారిక సెటిల్మెంట్ అవుట్పోస్టులను చట్టబద్ధం చేసే ప్రణాళికలను ఆరు నెలల పాటు నిలిపివేస్తానని ప్రతిజ్ఞ కూడా చేసింది.
“హింసను అరికట్టడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి” అని ఈజిప్షియన్ మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. వచ్చే నెలలో ఈజిప్టులో జరిగే తదుపరి సమావేశంలో పురోగతిపై ఇరుపక్షాలు నివేదిస్తాయని పేర్కొంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం మాటల్లో ఉన్నా… దీని అమలు మాత్రం ఒక సవాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ వాగ్దానాలు చాలా వరకు విఫలమైన సందర్భాలే ఎక్కువ. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఇటీవల వేలాది కొత్త నివాస గృహాల నిర్మాణాన్ని ఆమోదించింది.
మధ్యవర్తులు రంజాన్కు ముందు ఉద్రిక్తతలను తగ్గించాలనుకుంటున్నారు, ఇది ఈ వారంలో ప్రారంభమవుతుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన క్యాబినెట్ సమావేశంలో ఆదివారం నాటి శిఖరాగ్ర సమావేశం గురించి ప్రస్తావించలేదు.
పాలస్తీనా అధికారి హుస్సేన్ అల్ షేక్ ఈజిప్టులో సమావేశం “మాపై నిరంతరంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దురాక్రమణకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నాం” అని ట్వీట్ చేశారు.
గత నెల చివర్లో జోర్డాన్లో జరిగిన సమావేశంలోనూ ఉద్రిక్తతలను తగ్గించుకుంటామని ఇరుపక్షాలు ఒప్పందంపై చేసుకున్నాయి. అయితే అదే రోజున కొత్త హింస చెలరేగడంతో ఈ ఒప్పందం పట్టాలు తప్పింది.