ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశ ద్రోహానికి, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో ఈ చర్య తీసుకుటున్నట్లు వెల్లడించింది.
“విదేశీ నిధుల కేసు, మే 9 నాటి అల్లర్లు, మరియు సైఫర్ ఎపిసోడ్ వంటి కేసులతో పాటు దేశ ద్రోహానికి సంబంధించి చాలా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని మేము నమ్ముతున్నామని” సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటన చేశారు.
71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 2022 ఏప్రిల్లో ప్రధాని పదవి నుంచి వైదొలిగాక పలు కేసుల కారణంగా రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి వ్యతిరేకంగా ఆపార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్,పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీలపై ఆర్టికల్ 6 కింద రాజద్రోహం కేసులు నమోదు చేయనున్నట్లు జియో న్యూస్ తెలిపింది.
కాగా, పాకిస్తాన్ ప్రభుత్వ ఈ ప్రకటనపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ప్రతినిధులు భగ్గుమన్నారు. ‘పాకిస్థాన్ జాతీయ, నాలుగు ప్రాంతీయ అసెంబ్లీల్లో మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లకు పోటీపడే అర్హత పీటీఐకి ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చింది. అదే జరిగితే 108 సీట్లతో జాతీయ అసెంబ్లీలో పీటీఐ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. దీంతో నిరాశకు గురైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించింది’ అని ఒక ప్రకటనలో పార్టీ ప్రతినిధులు నుండిపడ్డారు.
ఇమ్రాన్ఖాన్ 1996 పీటీఐ పార్టీని స్థాపించారు. 2018 నుంచి 2022 వరకూ ప్రధానమంత్రిగా సేవలందించారు. అయితే విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో 2022లో ఇమ్రాన్ ప్రభుత్వ కుప్పకూలింది.