ఢాకా : ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానాన్ని రద్దు చేయాలని నిరసన తెలిపిన వారికి, అధికార పార్టీకి విధేయులైన ఇతరులకు మధ్య జరిగిన ఘర్షణల్లో బంగ్లాదేశ్లో 100 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించిన జనవరిలో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలిచిన తర్వాత ప్రధాని షేక్ హసీనా ఎదుర్కొన్న మొదటి నిరసన ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.
వేలాది మంది కోటా వ్యతిరేక నిరసనకారులు,పీఎం హసీనా అవామీ లీగ్ విద్యార్థి విభాగం సభ్యులు ఢాకాతో సహా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో ఒకరిపైకి మరోకరు రాళ్ళు విసురుకున్నారు. కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్గారని పోలీసులు తెలిపారు. దీంతో యూనివర్సిటీ పలు క్యాంపస్లలో విద్యార్థులు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.
తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ర్యాలీలు కొనసాగించాలని ఆందోళనకారులు పిలుపునిచ్చారు.
“ఇది విద్యార్థి ఉద్యమం కంటే ఎక్కువ. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు రెచ్చిపోయారు. కాబట్టి, సామాన్య ప్రజలు వీధుల్లోకి రావాలని” కోటా వ్యతిరేక నిరసనల సమన్వయకర్త నహిద్ ఇస్లాం అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30% ఉద్యోగ కోటాలను పునరుద్ధరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఈ నెల ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం గత వారం ఆ ఉత్తర్వును ఒక నెలపాటు సస్పెండ్ చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు.
విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చడానికి హసీనా నిరాకరించడంతో ఆదివారం రాత్రి నిరసనలు తీవ్రమయ్యాయి, సమస్య ఇప్పుడు కోర్టులో ఉందని పేర్కొంది.
స్వాతంత్య్ర సమరయోధుల బంధువులకు ఉద్యోగ కోటాను వ్యతిరేకించే వారు ‘రజాకార్’ అని, 1971 స్వాతంత్ర్య యుద్ధంలో పాక్ సైన్యానికి సహకరించారని హసీనా అన్నారు. ఆమె వ్యాఖ్యలతో వేలాది మంది విద్యార్థులు ఢాకా యూనివర్శిటీ క్యాంపస్లోని తమ వసతి గృహాలను వదిలి అర్ధరాత్రి నిరసనకు దిగారు.
“యువ విద్యార్థుల భావోద్వేగాలను ఉపయోగించి కోటా వ్యతిరేక ఉద్యమాన్ని దేశ వ్యతిరేక ఉద్యమంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది” అని విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ అన్నారు. “అస్థిర పరిస్థితిని కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించదని”ఆయన స్పష్టం చేశారు.