ఇస్తాంబుల్ [టర్కీ]: ఉక్రెయిన్పై 33 రోజులుగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్లోని పలు నగరాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ రాజధాని కీవ్ ను మాత్రం కైవసం చేసుకోలేకపోతోంది. రష్యన్ సేనల భీకర దాడులను ఉక్రెయిన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతూ.. రాజధానిని కాపాడుకుంటోంది. అయితే ఓ వైపు యుద్ధం సాగిస్తూన్నా.. శాంతి ప్రయత్నాలనూ ఆపడంలేదు. యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు దేశాల ప్రతినిధులు మరో దఫా సంప్రదింపులకు సిద్ధమయ్యారు.
ఉక్రెయిన్తో తాజా శాంతి చర్చల కోసం రష్యా ప్రతినిధి బృందం సోమవారం టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్కు చేరుకున్నట్లు సిఎన్ఎన్ టర్క్ బ్రాడ్కాస్టర్ను ఉటంకిస్తూ జిన్హువా నివేదించింది. దౌత్య కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే విమానం రష్యా ప్రతినిధులతో అటాటర్క్ విమానాశ్రయంలో దిగింది.
టర్కీ దౌత్య వర్గాల సమాచారం ప్రకారం, నేడు చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఫోన్ కాల్లో, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్, రష్యా ఇస్తాంబుల్లో తదుపరి రౌండ్ చర్చలను నిర్వహించడానికి అంగీకరించారు. ఈ ప్రక్రియలో టర్కీ సాధ్యమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ఎర్డోగాన్ పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు, రష్యా, ఉక్రెయిన్ బెలారస్లో… మూడు రౌండ్ల వ్యక్తిగత చర్చలు జరిపాయి.
ఈ చర్చల కోసం ఓ వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాము తటస్థంగా ఉండేందుకు సిద్ధమని, నాటో సభ్యత్వం కోరబోమని చెబుతున్నా.. రష్యాకు ఆమోదయోగ్యం కాని కొన్ని షరతులనూ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధం ఆపడానికి తన కండిషన్లను చెబుతూ పంపిన లేఖపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించినట్లు వెస్ట్రన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జెలెన్స్కీని వదలబోనని ఆ లేఖ తీసుకెళ్లిన శాంతి దూతతో చెప్పినట్లుగా తెలుస్తోంది.