న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో ఒక ఒప్పందం కుదింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) పత్రాలపై గత ఫిబ్రవరిలో భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి.
భారత మీడియాకు ఆన్లైన్ ఇంటర్వ్యూలో, యుఎఇ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ బిన్ జెయోడి మాట్లాడుతూ, ఈ వాణిజ్యం పూర్తి స్థాయి ఆర్థిక, సాంకేతిక, మానవ మూలధన మార్పిడికి తలుపులు తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశం-యుఎఇల మధ్య అమలులోకి వచ్చిన ఈ ఒప్పందం వచ్చే ఐదేళ్లలో ఈ ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 60 బిలియన్ డాలర్ల నుండి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మన దేశ వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో పేర్కొన్నారు. రెండు దేశాలు ఆమోదించిన తర్వాతే ఈ ఒప్పందం మే 1 నుంచి అమల్లోకి వస్తుందని అరేబియన్ పోస్ట్ వార్తా సంస్థ పేర్కొంది.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. అలాగే యూఏఈ విదేశాల్లో భారీ పెట్టుబడి పెట్టగల సామర్థ్యంతో ఉంది. పెరుగుతున్న భారత్-యుఎఇ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు సుస్థిరతకు దోహదపడతాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయి.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) వాణిజ్యంతో,యూఏఈ 2018-19లో భారతదేశం యొక్క మూడవ-అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. అదే సంవత్సరానికి 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంతో యూఎస్ తర్వాత యూఏఈ రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా నిలిచింది. యూఏఈకి సంబంధించి, 2018నుంచి భారతదేశం రెండవ-అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. యూఏఈ భారతదేశంలో 10వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది, ఇది 13-14 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టిందని అరేబియన్ పోస్ట్ పేర్కొంది.
ఆర్థిక రంగంలోనే కాదు, రక్షణ రంగంలో కూడా భారతదేశం, యుఎఇ తమ సంబంధాన్ని విస్తరిస్తున్నాయి. రెండు దేశాల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మార్చి 26న, భారత సైన్యం UAE సైన్యంతో శిక్షణ, ద్వైపాక్షిక/బహుపాక్షిక వ్యాయామాల నిర్వహణ, రక్షణ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చలు కూడా జరిపింది.