న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ‘మోదీ ఇంటిపేరు ఉన్న వారందరూ దొంగలే’’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై సూరత్ కోర్టులో పరువునష్టం కేసు 2019లో దాఖలైంది.
ఈ విషయమై చర్చించేందుకు పార్లమెంట్లో కాంగ్రెస్ చీఫ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో 12 ప్రతిపక్ష పార్టీల సభ్యులు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం 11:20 గంటల ప్రాంతంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేస్తాయని కాంగ్రెస్ తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమ వాదనను వినిపించేందుకు సమయం కోరినట్లు పార్టీ అధ్యక్షుడు చెప్పారు.
కాగా, ఈ కేసులో ఇచ్చిన తీర్పుపై పై కోర్టులో సవాలు చేయడానికి రాహుల్ గాంధీకి గడువు ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ లాయర్లు గుజరాత్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆయనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి రూ.10 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
“ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదు, ఇది చాలా తీవ్రమైన రాజకీయ సమస్య, ఇది మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించినది. మోడీ ప్రభుత్వం… వేధింపులు, ప్రతీకారం, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పేందుకు ఇదే మంచి ఉదాహరణ”అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ నిన్న సాయంత్రం విలేకరులతో అన్నారు.
ఈ విషయమై కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే నివాసంలో దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగిందని, సాయంత్రం అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతలతో పార్టీ చీఫ్ సమావేశం నిర్వహించి, రాష్ట్రాల్లో ఆందోళనలకు ప్లాన్ చేయాలని నిర్ణయించినట్లు జైరాం రమేష్ తెలిపారు.
దీనిపై న్యాయపరంగా కూడా పోరాడతాం. చట్టం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటాం. మేము వెనక్కి తగ్గము, మేము భయపడము, మేము దీనిని పెద్ద రాజకీయ సమస్యగా కూడా చేస్తాము, ”అని రమేష్ తెలిపారు.
పరువు నష్టం కేసు తీర్పును పై కోర్టులో సవాలు చేస్తాం. తీర్పుపై స్టే వస్తుంది లేకుంటే రద్దు చేస్తారని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో రాహుల్పై అనర్హత వేటు పడుతుందా? అనే అంశం చర్చనీయాంశమయ్యింది. నేర నిరూపణ అయితే ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉదహరిస్తున్నారు. అయితే లోక్సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
– महात्मा गांधी
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023