వాజ్పేయీ హయాంలో మొదలై.. మోదీ హయాంలో పుట్టింటికి!
దేశంలోనే తొలి ఎయిర్లైన్స్.. దాదాపు 90 ఏళ్ల చరిత్ర.. మహారాజాగా కీర్తి.. ఇవన్నీ ఎయిరిండియా గురించే.
కానీ ఇదంతా గతం. కానీ, ఇప్పటి ఎయిరిండియా అంటే అప్పులే గుర్తొస్తాయి. ‘సంస్థను విక్రయించడం.. లేదంటే మూసేయడం.. ఇదే మా ముందున్న మార్గం’ అని ఓ దశలో ప్రభుత్వమే పేర్కొందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పలు దఫాల ప్రభుత్వ ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు పూర్తయ్యింది. దాన్ని నెలకొల్పిన టాటా సంస్థ గూటికే ఎయిరిండియా మళ్లీ చేరింది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా ప్రారంభం.. ప్రైవేటీకరణకు దారితీసిన పరిస్థితులు.. అందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఓ సారి చూద్దాం..
టాటా టు ప్రభుత్వం..
టాటా గ్రూప్ వ్యవస్థపాకుడు జేఆర్డీ టాటా 1932లో దేశీయంగా తొలి విమానయాన సంస్థను నెలకొల్పారు. అదే టాటా ఎయిర్లైన్స్. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ కాలంలోనే కరాచీ- బొంబాయి మధ్య దీని సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత 1946లో ఎయిర్ ఇండియాగా మార్చారు. ఐరోపాకు విమానాలను ప్రారంభించడం ద్వారా ఎయిరిండియా ఇంటర్నేషనల్ను ఆవిష్కరించారు. ఇందులో ప్రభుత్వానికి (49%), టాటాలకు (25%) వాటా ఉండేది. 1948లో ఎయిరిండియా అంతర్జాతీయ సేవలు ప్రారంభమయయ్యాయి. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచిన తొలి విమానయాన సంస్థ అదే. 1953లో ప్రభుత్వం ఎయిరిండియాను జాతీయీకరించింది. ప్రభుత్వ పరమైన కొన్నేళ్ల వరకు ఎయిరిండియా ఏకఛత్రాధిపత్యమే నడిచింది. అయితే దేశంలో సరళీకరణ విధానాల వల్ల 1994-95 మధ్యలో ప్రైవేటు విమానయాన సంస్థలు పుట్టుకొచ్చాయి. తక్కువ ధరకే టికెట్లు ఆఫర్ చేయడంతో ఎయిరిండియాకు నష్టాలు మొదలయ్యాయి. అవే ఎయిరిండియా ప్రైవేటీకరణకు బీజాలు వేశాయి.
వాజ్పేయీ హయాంలో తొలి యత్నం..
నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాలో వాటాలు విక్రయించేందుకు 2000-01 మధ్య అటల్ బిహారీ వాజ్పేయీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముందుకొచ్చింది. కనీసం 40 శాతం వాటాలను విక్రయించాలని అప్పట్లో నిర్ణయించింది. అప్పట్లో సింగపూర్ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్ సంయుక్తంగా ఎయిరిండియాలో వాటాల కొనుగోలుకు ఆసక్తి కనబరిచాయి. అయితే, ప్రైవేటీకరణను ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకిండచంతో సింగపూర్ ఎయిర్లైన్స్ వెనక్కి తగ్గింది. దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయింది. 2007-08 మధ్య ఇండియన్ ఎయిర్లైన్స్తో ఎయిరిండియా విలీనం అయ్యాక సంస్థకు నష్టాలు మరింత పెరిగాయి. 2004-14 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ప్రైవేటీకరణ విషయంలో ఆసక్తి చూపలేదు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఎయిరిండియా ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడ్డాయి.