న్యూఢిల్లీ: కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణుకుతోంది. యమునా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహిస్తోంది. పొరుగున ఉన్న హర్యానా భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి దాదాపు 2,13,679 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఢిల్లీలో గత సాయంత్రం 205.33 మీటర్ల ప్రమాదకర మార్కును అధిగమించిన యమునా ఈ ఉదయం 206.32కి చేరుకుంది.
ఊహించిన దానికంటే ముందుగానే నది ప్రమాద స్థాయిని అధిగమించిందని అధికారులు తెలిపారు. 1978లో ఈ నది ఆల్-టైమ్ రికార్డ్ నీటి స్థాయి 207.49 మీటర్ల స్థాయికి చేరుకుంది – ఇది యమునా నదికి “అధిక వరద” స్థాయి.
వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. వారిని నగరంలోని పలు ప్రాంతాల్లోని సహాయక శిబిరాలు, కమ్యూనిటీ సెంటర్లకు తరలించనున్నారు.
భారీ వర్షం కారణంగా నగరం అంతటా విస్తృతంగా వరదలు వచ్చాయి, పార్కులు, అండర్పాస్లు, మార్కెట్లు, ఆసుపత్రి ప్రాంగణాలు కూడా ముంపునకు గురయ్యాయి. నివాసితులు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ కనిపించారు. వారి కష్టాలకు సంబంధించిన చిత్రా, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వ్యాపించాయి. దీంతో నగరంలో డ్రైనేజీ మౌలిక సదుపాయాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
వరద పీడిత ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఢిల్లీ ప్రభుత్వం 16 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. క్విక్ రెస్పాన్స్ టీమ్, బోట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి అనేక చర్యలను ప్రకటించారు.
మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ… ఢిల్లీలో ఇంత భారీ వర్షాలు కురువడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి అని అన్నారు. 1982లో 24 గంటల వ్యవధిలో 169 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో చివరిసారిగా ఇంత వర్షం కురిసింది. దురదృష్టవశాత్తు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఇంత భారీ వర్షపాతానికి తట్టుకోగలిగేలా రూపొందించలేదని సీఎం అన్నారు.
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్లలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.
భారీ వర్షం దాదాపు ఉత్తర భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక, రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేసాయి. ఈ ప్రాంతంలో అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. నగరాలు, పట్టణాలలో, చాలా రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి.
హిమాచల్ప్రదేశ్ – వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతింది – కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో కోట్ల విలువైన ఇళ్లు, ఆస్తులను దెబ్బతిన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడి అన్ని విధాల మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఉత్తరాఖండ్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక రోడ్లు, హైవేలు మూసుకుపోయాయి. నదులలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటిందని నివేదికల వెల్లడించాయి.
రాజస్థాన్, పంజాబ్ ,హర్యానాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రాజస్థాన్లో, తీవ్రమైన రుతుపవనాల వర్షం సాధారణ జీవితాన్ని స్తంభింపజేసింది, రోడ్లు, రైలు ట్రాక్లు, ఆసుపత్రులను కూడా వరదలు ముంచెత్తాయి. ఈరోజు రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.