న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నేడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్ణయించింది. ఈరోజు లోక్ సభలో దీనికి సంబంధించి నోటీసు ఇవ్వనుంది. మణిపూర్ లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలన్న డిమాండ్ తో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడ్తున్నారు. 26 పార్టీల విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశంలో నిన్న ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ విప్
అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. బుధవారం పార్లమెంటు సమావేశాలకు కచ్చితంగా హాజరుకావాలని పార్టీ ఎంపీలను ఆదేశించింది. అలాగే నేటి ఉదయం 10.30 గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. మణిపూర్లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే డిమాండ్తో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడ్తోంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును నేడు లోక్ సభలో ఇవ్వనున్నారు.
ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ..
మణిపూర్ అంశంపై ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ స్పందించాలన్న డిమాండ్తో పాటు, మణిపూర్ హింస పై సమగ్ర చర్చ జరగాలన్న లక్ష్యంతో విపక్షం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడ్తోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. అందువల్ల, విపక్ష అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశమే లేదు. లోక్ సభలో మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్య 272 కాగా, బీజేపీకి స్వయంగా 303 మంది సభ్యులున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి అవిశ్వాస తీర్మానం 2018, జులై లో విపక్షం ప్రవేశపెట్టింది. ఆ అవిశ్వాస తీర్మానాన్ని అధికార పక్షం ఓడించింది. నాటి ఓటింగ్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది, వ్యతిరేకంగా 325 మంది ఎంపీలు ఓటు వేశారు.