24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

జీ20 అతిధులకు ‘భారత్, ద మదర్ ఆఫ్ డెమోక్రసీ’ పేరిట బుక్‌లెట్‌లు!

న్యూఢిల్లీ: ‘ఇండియా పేరును – ఇకనుంచి భారత్‌గా మార్చి రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వడంతో తాజాగా రాజకీయ దుమారం చెలరేగుతున్న సమయంలోనే కేంద్రం మరో అడుగు ముందుకేసింది. జీ-20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్ అని ముద్రించింది. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది. ఈ సదస్సుకు నాయకత్వం వహించడాన్ని గుర్తు చేస్తూ ‘భారత్, ద మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా పేర్కొంది.

రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికార ఆహ్వాన పత్రాల్లో ఇలా భారత్ అని పేర్కొనడం ఇదే తొలిసారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు… భాగస్వామ్య 20 దేశాలతో పాటు మరో తొమ్మిది ఆతిధ్య దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్లెట్లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి ‘భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక’ కాగా రెండవది ‘భారతదేశంలో ఎన్నికలు’.

మొదటి బుక్‌లెట్‌

మొదటి 26 పేజీల బుక్‌లెట్‌లో భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు.

రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు.

బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు.

రెండవ బుక్‌లెట్‌

‘భారతదేశంలో ఎన్నికలు’పై బుక్‌లెట్
‘భారతదేశంలో ఎన్నికలు’ అనే అంశంపై ప్రభుత్వం 15 పేజీలతో కూడిన మరో బుక్‌లెట్‌ను కూడా విడుదల చేసింది. ఈ బుక్‌లెట్ భారతదేశంలో సాధారణ ఎన్నికల చరిత్రను వివరిస్తుంది, మొదటి ఎన్నికల కసరత్తు 1952లో 2019 వరకు జరిగిన ఎన్నికల వరకు ఇందులో ప్రస్తావించారు.

రాజకీయ పార్టీల సంఖ్య, ఓటర్ల సంఖ్య, మహిళల భాగస్వామ్యం, భారత ఎన్నికల సంఘం ఏర్పాటుతో సహా ప్రతి ఎన్నికల్లో సాధించిన పురోగతి గురించి సమాచారాన్ని అందిస్తుంది. అయితే “భారత్” అనే పేరు ఈ బుక్‌లెట్‌లో ఎక్కడా ప్రస్తావించబడలేదు.

మొత్తంగా ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్‌లెట్‌ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles