ముంబయి: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు. ఆస్పత్రిలో మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని శంకర్రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. మిగతా 12మంది పెద్దలు పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని వైద్యులు చెప్పారు.
ఈ ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని, అయితే 70-80 కి.మీ పరిధిలో ఉన్న ఏకైక ఆరోగ్య సంరక్షణ కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని వివరించారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ బడ్జెట్ను మించిపోతుందని, అందుకే మందుల కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు.
హాఫ్కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగలేదని డీన్ చెప్పారు. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసిన తర్వాత రోగులకు మందులు అందజేస్తున్నట్లు తెలిపారు.