ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత ఏడాది రెండు తెగల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. గొడవకు కారణం ఓ తెగ అని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. ఆ తెగ వారు దేశానికి చెందిన వారు కాదని, పొరుగున గల మయన్మార్ నుంచి వచ్చారని స్పష్టం చేసింది. వారి వల్లే రాష్ట్రంలో అశాంతి నెలకొందని తేల్చి చెప్పింది. అసలు 1961 తర్వాత మణిపూర్లో స్థిరపడిన వారిని తమ రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మొన్న ఓ ప్రకటన చేశారు.
సెటిలర్లను బహిష్కరించాలని మణిపూర్ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై మిజో స్టూడెంట్స్ యూనియన్ (MSU) మణిపూర్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, MSU సోమవారం అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మణిపూర్ ప్రభుత్వం కుకీ-జో గిరిజనులను బహిష్కరిస్తే, మిజోరం నుంచి మెయిటీలను బహిష్కరించడం ఖాయమని మిజో విద్యార్థుల సంఘం ఏకగ్రీవంగా పేర్కొంది.
మిజో స్టూడెంట్స్ యూనియన్ (MSU) మిజోరాంలో మెయిటీ సెటిలర్లందరి సమగ్ర జాబితాను (వారి చిరునామాలు, వృత్తులతో సహా ) రూపొందించారని ఉద్ఘాటించారు. “మిజో-జాతి తెగలను రాష్ట్రం నుండి బహిష్కరించే యోచనతో మణిపూర్ ప్రభుత్వం ముందుకు సాగితే, మిజోరం నుండి మెయిటీలందరినీ బహిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని విద్యార్థుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
మణిపూర్లో నివసిస్తున్న కుకీ-జో కమ్యూనిటీలోని సభ్యులందరినీ అన్యాయంగా “అక్రమ వలసదారులు”గా ముద్రించారని MSU అధ్యక్షుడు శామ్యూల్ జోతాన్పుయా ఆరోపించారు. గత మేలో మణిపూర్లో చెలరేగిన జాతి హింసలో కనీసం 175 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు అంచనా వేస్తున్నాయి.
“బ్రిటీష్ పూర్వ కాలం నుండి కుకీ-జో ప్రజలు ప్రస్తుత మణిపూర్ రాష్ట్రంలో స్థిరనివాసులుగా ఉన్నారని, మణిపూర్ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం గుర్తించడం చాలా కీలకం. అల్లర్ల తరువాత వారిప్పుడు మణిపూర్లోని కొండ ప్రాంతాలలో నివాసముంటున్నారని చెప్పారు.
“మణిపూర్లోని కుకి-జో సెటిలర్లు)ఇండియా యూనియన్లో ఉన్న ప్రస్తుత మణిపూర్ రాష్ట్రం పుట్టక ముందే అక్కడ స్థిరపడ్డారు” అని ఆయన నొక్కి చెప్పారు.
మణిపూర్లో కొనసాగుతున్న జాతి కలహాలకు ఇది తోడ్పడుతోందని, మైటీస్ కోసం ఎక్కువ భూమిని క్లెయిమ్ చేసేందుకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ “భూ కబ్జా ప్రచారం” చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“బీరేన్ సింగ్ 1961ని కటాఫ్ ఇయర్గా నిర్దేశిస్తున్నప్పటికీ, ఇందులో ఏదో దురుద్దేశం దాగి ఉండని, కుకీ-జో జాతి తెగలందరినీ రాష్ట్రం నుండి బహిష్కరించడమే” వారి అంతిమ లక్ష్యమని జోతాన్పుయా ఆరోపించారు.
మణిపూర్లోని కొనసాగుతున్న జాతి సంఘర్షణకు మైతీ సంస్థలతో పాటు, కుకీ-జో గిరిజనులు కారణమని బీరెన్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం ఆరోపిస్తోంది. వారు మిజోరాం నుండి లేదా మయన్మార్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించారని వారు ఆరోపించారు.