రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. కవార్ధా జిల్లాలోని కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పానీ గ్రామ సమీపంలో సోమవారం పికప్ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ముగ్గురు మైనర్లున్నారు. పికప్ ట్రక్కులో తునికి ఆకులు సేకరించి తిరిగి వస్తున్న కూలీలు ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు కవార్ధా ఎస్పీ తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్ పరీక్షల కోసం పంపించారు.
ప్రమాదం జరిగే సమయానికి వ్యాన్లో సుమారు 40మంది వరకు ప్రయాణికులున్నారు. పికప్ ట్రక్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అదుపు తప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో బాధితులకు సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
కార్మికుల మృతిపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ విచారం వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలందరికీ సానుభూతి తెలిపారు. ఇప్పటికే స్థానిక యంత్రాంగం సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారని, అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.