బెంగళూరు: వరుస లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నెల రోజుల క్రితం భారతదేశం విడిచిపెట్టిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ శుక్రవారం మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరవుతానని వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ తన తాత (మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ), తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.
“ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగినప్పుడు నాపై ఎలాంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు కాలేదు. నా విదేశీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమే. 2-3 రోజుల తర్వాత నేను నా పర్యటనలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా నాపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. సిట్ కూడా నాకు నోటీసు అందించింది. ఆ నోటీసుకు కూడా నేను స్పందించాను.
నా రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని కొందరు నాపై కుట్ర పన్నారు.. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.. అందుకే కొన్ని రోజులు దూరం పాటించాలని నిర్ణయించుకున్నాను.
తనపై విశ్వాసం ఉంచాలని కుటుంబ సభ్యులు, అనుచరులను ప్రజ్వల్ అభ్యర్థించారు. “నేను న్యాయపరంగా పోరాడతాను. నాకు చట్టంపై నమ్మకం ఉంది.”
ప్రజ్వల్ వీడియోపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ…హసన్ ఎంపీ చట్టాన్ని ఎదుర్కోవాలని అన్నారు. ఆయన ఏం మాట్లాడినా సిట్ ఎదుట హాజరుకావడం తప్ప మరో మార్గం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రజ్వల్ టార్గెట్ చేయడంపై శివకుమార్ మాట్లాడుతూ… “రాహుల్ మీడియా కథనాల ఆధారంగా మాట్లాడాడు. అందులో తప్పు లేదు. కాలమే సమాధానం చెబుతుందని” అన్నారు.
సామాజిక మాధ్యమం Xలో ప్రజ్వల్ వీడియో లింక్