లక్నో: చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.. ప్రళయం ముంచుకొస్తున్నా సరే.. మీ చేతిలో ఉన్న మొక్కను నాటండి అన్న మహా ప్రవక్త (సఅసం) హదీసుకు అనుగుణంగా అరుదైన ‘ఆకుపచ్చ’ లోకం కోసం ప్రపంచవ్యాప్తంగా చెట్లను నరికివేయవద్దని, పంటలను తగలబెట్టవద్దని ప్రజలను కోరుతూ లక్నోలోని ఒక ఇస్లామిక్ సెమినరీ ఫత్వా జారీ చేసింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మహమ్మద్ తారీఖ్ ఖాన్ అనే వ్యక్తి వివరణ కోరగా ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఐసిఐ) ‘ఫత్వా’ జారీ చేసింది.
“ఖురాన్ ప్రకారం.. పచ్చదనాన్ని రక్షించడం, నీటిని ఆదా చేయడం, వృథాను నివారించడం ముస్లింల హక్కులు. ప్రతి ముస్లిం పచ్చని చెట్లు,పంటలకు నిప్పు పెట్టకుండా చూసుకోవాలి, ”అని ఖాన్ అభ్యర్థనకు ప్రతిస్పందనగా ICI చైర్పర్సన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ అన్నారు.
ఒక వీడియో సందేశంలో, మౌలానా ఖలీద్ రషీద్ మాట్లాడుతూ… సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని, చెట్లను నరికివేయకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“సర్వ సృష్టికర్త సూచనల ప్రకారం.. మానవులు, జంతువులతో సహా అన్ని జీవులకు ప్రయోజనం చేకూర్చే మొక్కలు నాటిన వారికి ప్రతిఫలం చేకూరుతుందని సెలవిచ్చారు. చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలను కలుషితం కాకుండా కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయండి, ”అని ఆయన అన్నారు, “ఇస్లాంలో చెట్లు, పంటలను కాల్చడం నిషేధం. అది మహాపాపం. యుద్ధ సమయంలో కూడా, చెట్లు, తోటలు, పొలాలు కాల్చకూడదనే నియమం ఉన్న సంగతి తెలిసిందే.