న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17 న కమిటీ తొలి సమావేశం జరగనున్నది. త్రి సభ్య కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గతంలో ప్రకటన చేసిన కేంద్రం.. ప్రస్తుతం హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చినట్లుగా సమాచారం.
సమావేశంలో చర్చలు జరిగే ప్రధాన అంశాలు..
1. ఏపీ ఫైనాన్స్ కొర్పొరేషన్ విభజన
2. విద్యుత్ వినియోగ అంశాలు
3. పన్ను అంశాల్లో సవరణలు
4. ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ సంస్థలో నగదు అంశం
5. వనరుల సర్దుబాటు
6. 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం
7. ప్రత్యేక హోదా
8. పన్ను ప్రోత్సాహకాలు
9. వనరుల వ్యత్యాసం