న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)లో 5 శాతం వాటా విక్రయించేందుకు ప్రభుత్వం ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం నాడు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేశామని ఈమేరకు డిఐపిఎఎం (పెట్టుబడి, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. దేశంలో అతిపెద్ద ఐపిఒ ఎల్ఐసి 31.6 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఎల్ఐసి ఎంబెడెడ్ వాల్యూ రూ.5.4 లక్షల కోట్లుగా(72 బిలియన్ డాలర్లు) ఖరారు చేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఎల్ఐసీ ఎంబెడెడ్ వ్యాల్యూ రూ. 5,39,686 కోట్లు. డాలర్లలో లెక్కిస్తే 7200 కోట్ల డాలర్లు. అమెరికాకు చెందిన మిలిమ్యాన్ అనే సంస్థ ఈ విలువ గట్టింది. అంతర్జాతీయంగా బీమా కంపెనీల విలువ కట్టేందుకు ఏ ఫార్ములా ఉపయోగిస్తారో… అదే ఫార్ములా ఉపయోగించి ఎల్ఐసీ ఎంబెడెడ్ వ్యాల్యూను లెక్కించింది. సాధారణంగా ఎంబెడెడ్ వ్యాల్యూకు నాలుగు రెట్ల మొత్తాన్ని మార్కెట్ వ్యాల్యూగా పరిగణిస్తారు. అంటే ఎల్ఐసీ మార్కెట్ వ్యాల్యూ 28,800 కోట్ల డాలర్లు లేదా మన కరెన్సీలో రూ. 22 లక్షల కోట్లు అన్నమాట. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దేశంలో అతి పెద్ద కంపెనీగా ఎల్ఐసీ అవతరించింది. ఒక ప్రభుత్వ రంగ ఈ స్థాయికి ఎదగడం ఎంత గొప్పవిషయం అనిపిస్తుంది. (రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.16 లక్షల కోట్లు) మొత్తంగా ఎల్ఐసి పబ్లిక్ ఆఫర్ ద్వారా 31,62,49,885 షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. మరి ఒక్కో షేర్ను ప్రభుత్వం ఏ ధరకు విక్రయిస్తుందనే దానిని బట్టి… ఎల్ఐసీ మార్కెట్ వ్యాల్యూ మరింతగా పెరుగుతుంది. ఎంబెడెడ్ వాల్యూతో ఎల్ఐసి మార్కెట్ విలువ, అలాగే ఫ్లొటేషన్లో ప్రభుత్వం ఎంత మేరకు నిధులను సమీకరిస్తుందని నిర్ణయించేందుకు దోహదం చేస్తుంది. ఐపిఒ ద్వారా ప్రభుత్వం 12 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించాలని అనుకుంటోంది. ఈ నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ద్రవ్యలోటు అంతరాన్ని పూడ్చేందుకు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చమురు మార్కెటింగ్ సంస్థ బిపిసిఎల్, ఎస్సిఐ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), ఇతర సంస్థల ప్రైవేటీకరణకు కూడా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 78వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశంలోనే అతిపెద్ద ఎల్ఐసి ఐపిఒ ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పూర్తి చేసేందుకు గాను చైర్మన్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసి చైర్మన్గా ఎం.ఆర్.కుమార్ 2023 మార్చి వరకు కొనసాగనున్నారు.