శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లా దేసా అడవుల్లో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మేజర్ ర్యాంక్ అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు మరణించారు.
వివరాల్లోకి వెళ్తే…20 నిమిషాల ఎన్కౌంటర్ తర్వాత అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదులను వెంబడించే క్రమంలో ఐదుగురు సైనికులు, ఒక పోలీసు గాయపడ్డారని నివేదికలు తెలిపాయి. ఆసుపత్రికి తరలించినప్పటికీ, నలుగురు సైనికులు గాయాలతో మరణించారు.
మరణించిన సైనికుల్లో ఇటీవలే పదోన్నతి పొందిన 10 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన మేజర్ బ్రిజేష్ థాప్పా కూడా ఉన్నారు.
ఆర్మీకి చెందిన నగ్రోటా ఆధారిత వైట్ నైట్ కార్ప్స్ గాయాలకు సంబంధించిన ప్రాథమిక నివేదికలను ధృవీకరించింది. కానీ నిర్దిష్ట వివరాలను అందించలేదు. అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ఘర్షణ మొదలైంది.
ఉగ్రవాదులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, అయితే ఒక అధికారి నేతృత్వంలోని దళాలు ధైర్యంగా వారిని వెంబడించాయని, రాత్రి 9 గంటలకు మరోసారి కాల్పులకు దారితీసిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మరిన్ని బలగాలను పంపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
గత పది రోజుల్లో జమ్మూ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో అతిపెద్ద దాడి ఇది. జూలై 8న, కథువా జిల్లాలో ఆర్మీ వాహనంపై భారీగా సాయుధ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక, భీకర దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు.మరో ఐదుగురు గాయపడ్డారు.
మొదట్లో పూంచ్, రాజౌరి జిల్లాల్లో కేంద్రీకృతమైన తీవ్రవాద కార్యకలాపాలు, కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్రవాదం లేని జమ్మూ అంతటా ఇప్పుడు విస్తరించాయి. జమ్మూ ప్రాంతంలో గత 32 నెలల్లో 48 మంది సైనికులు మరణించారు.
జూన్లో, జమ్మూలోని దక్షిణ రియాసి ప్రాంతంలోని ఒక పుణ్యక్షేత్రం నుండి వారిని తీసుకువెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది యాత్రికులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. 2017లో బస్సుపై జరిగిన ఆకస్మిక దాడిలో ఏడుగురు మరణించిన తర్వాత కాశ్మీర్లో యాత్రికులపై జరిగిన పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.