జైపూర్: రాజస్థాన్ విద్యా శాఖ 2024-25 కోసం పాఠశాల క్యాలెండర్లో చేర్పులను ప్రకటించింది, ఇందులో మే 28న సావర్కర్ జయంతి, ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును ‘స్వర్న్ ముకుత్ మస్తక్ దివాస్’ పేరిట ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించారు.
బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ఈ ఏడాది ఫిబ్రవరి 26 వ తేదీన రాజస్థాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పాఠశాలల వార్షిక క్యాలెండర్లో మార్పులు చేస్తామని మదన్ దిలావర్ మొదటి రోజు నుంచే చెబుతూ వస్తున్నారు.
కొత్త క్యాలెండర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది. గుర్తించదగిన మార్పులలో ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో ‘నో బ్యాగ్ డే’ని ప్రవేశపెట్టారు.
శీతాకాలపు సెలవుల్లో 11, 12 తరగతుల విద్యార్థులకు విద్యాపరమైన అభ్యాసంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ను కూడా ప్రవేశపెట్టింది.
ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆశిష్ మోదీ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం, ఆదివారంతో సహా పండుగలు, ఇతర కారణాల వల్ల సంవత్సరంలో 152 సెలవులు, 213 రోజుల పనిదినాలు ఉంటాయి. దీపావళి సెలవులు అక్టోబర్ 27 నుండి నవంబర్ 7 వరకు షెడ్యూల్ చేశారు. శీతాకాల సెలవులు డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు అమలులో ఉంటాయి.
2025-26 కొత్త అకడమిక్ సెషన్ జూలై 1, 2025న ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాల స్థలంపై ఆసక్తి కనబరిచే విధంగా క్యాలెండర్ను రూపొందించినట్లు మాధ్యమిక విద్యాశాఖ అధికారి తెలిపారు.
స్కూళ్లలో పాఠ్యాంశాల మార్పుతో ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. రాజస్థాన్ ప్రభుత్వం చేసిన పని తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాగా, ఈ నిర్ణయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సమర్థించుకుంటుండగా.. విపక్షాలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నాయి.