బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బీఎన్ పార్వతి తమకు ముడా పరిధిలో కేటాయించిన స్థలాలను తిరిగి అప్పగించేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.
అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి వెల్లడించారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై తన మొదటి రాతపూర్వక ప్రకటనలో… ‘నా భర్త సీఎం సిద్ధరామయ్య 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదు.. విలువలను పాటించి.. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తపడ్డారు.. ఆయన రాజకీయ, ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగరాదనే నేను ఇంటికే పరిమతమయ్యాను.. ఏనాడూ బయటకు రాలేదు..
ఆయనకు దక్కుతున్న ప్రజాదరణ చూసి సంతోషపడినా.. ముడా స్థలాల విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.. మా సోదరుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఈ స్థలాలు ఇంత రాద్దాంతం చేస్తాయని ఊహించలేదు.. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కాదు” అని సీఎం భార్య పార్వతి పేర్కొంది. అంతేకాదు, ముడా భూముల వ్యవహారంలో వస్తోన్న అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని సీఎం సతీమణి డిమాండ్ చేశారు.
కాగా, ఇప్పటికే ఈ వ్యవహారంపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏ1గా.. ఏ2, ఏ3లుగా ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఏ4గా భూ యజమాని దేవరాజు ఉన్నారు. దేవరాజు నుంచి భూమిని కొనుగోలుచేసిన మల్లికార్జున స్వామి.. తన సోదరి పార్వతికి ఈ ప్లాట్లను పసుపు కుంకుమగా ఇచ్చారు.