హైదరాబాద్: అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా 2022’ మార్చి 24 నుండి 27 వరకు బేగంపేట విమానాశ్రయంలో జరగనుంది. విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఈ ఏవియేషన్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రెండు రోజులు వ్యాపార అవసరాలకోసం కేటాయించారు. మిగతా రెండు రోజులు విమానయాన ప్రదర్శను తిలకించేందుకు సాధారణ ప్రజలను అనుమతి ఇస్తారు. వైమానిక దళానికి చెందిన బృందం ఏరోబాటిక్స్లో పాల్గొంటుంది. 125 కు పైగా అంతర్జాతీయ, దేశీయ ఎగ్జిబిటర్లు 11 హాస్పిటాలిటీ చాలెట్లు, 15 దేశ ప్రతినిధులు, 25 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఈ ఏవియేషన్ సదస్సులు పాల్గొననున్నారు. వింగ్స్ ఇండియా 2022 ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన విషయాలను చర్చించడానికి సన్నాహక సమావేశం మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఉషా పాధీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ఆథ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఫిక్కీ ఈవెంట్కు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి హాజరైన వారికి తెలియజేసింది. ఈవెంట్ కోసం వివిధ కార్యకలాపాలకు సంబంధించిన అమలు ప్రణాళికలను వివరించింది. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు, మౌలిక వసతుల కల్పన, పోలీసు, పౌరసరఫరాల శాఖ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.