ముంబయి: ఎంఐఎంతో శివసేన పొత్తు పెట్టుకుంటోందన్న వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఖండించారు. పూర్తిగా తప్పుడు ప్రచారం. తమది పూర్తి హిందుత్వ పార్టీ అని, శివసేనకు చెడ్డపేరు తేవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని, మహా వికాస్ అఘాదీ (MVA) సారథ్యంలోని శివసేన పరువు తీయడానికి ప్రతిపక్ష బిజెపి చేసిన “కుట్ర” అని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు వీడియో కాన్ఫరెన్సింగ్లో మాట్లాడారు.
ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ‘బీజేపీ బీ టీమ్’ అంటూ ఆరోపించారు. ఎంఐఎంతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని ఉద్ధవ్ థాకరే తేల్చి చెప్పారు. ఎందుంటే అది బీజేపీ బీ టీమ్ అని అన్నారు. బీజేపీ హిందుత్వను కేవలం రాజకీయం కోసమే వాడుకుంటుందని మండిపడ్డారు. ఇదంతా బీజేపీ చేస్తోన్న గేమ్ ప్లాన్లో భాగమేనని సీఎం ఆక్షేపించారు.
ఇక ఇదే విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. ‘ఏఐఎంఐఎంతో పొత్తుకు ఎవరు ప్రయత్నించారు? ఇది బీజేపీ గేమ్ప్లాన్, కుట్ర. ఏఐఎంఐఎం, బీజేపీల మధ్య నిగూఢ అవగాహన ఉంది. శివసేన హిందుత్వంపై ప్రశ్నలు సంధించేందుకు శివసేన పరువు తీయాలని ఏఐఎంఐఎంను బీజేపీ ఆదేశించింది. దీని ప్రకారం, AIMIM నాయకులు పొత్తు ప్రతిపాదన చేస్తున్నారు” అని థాకరేను ఉటంకిస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విలేకరులతో అన్నారు. AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించడానికి శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ (MVA)తో తమ పార్టీ పొత్తు పెట్టుకోవచ్చని సంచలనం ప్రకటన చేశారు. దీంతో శివసేన బీజీపీపై తీవ్రంగా విరుచుకుపడింది. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడమంటే అదో రోగం లాంటిదని, ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లిన వారితో పొత్తు ఎలా పెట్టుకుంటామని సూటిగా ప్రశ్నించారు. అసలు ఇలాంటి ప్రతిపాదన తమ ఆలోచనల్లోకి కూడా రాదని తేల్చి చెప్పారు. శివసేన ఛత్రపతి శివాజీ స్ఫూర్తితోనే రాజకీయాలు చేస్తుందని రౌత్ ప్రకటించారు.