న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పని చేసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని సంప్రదించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది సెప్టెంబరులో పార్టీని బలోపేతం చేయడంలో పీకే విస్తృత పాత్ర కోసం కాంగ్రెస్ నాయకత్వంతో జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడిని ఇటీవల నియమించుకుంది. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా మారారు.
ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల వరకు మాత్రమే పనిచేయడానికి పీకే ప్రతిపాదించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, మంగళవారం గుజరాత్ కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిపాయి. ఆ రాష్ట్రానికి చెందిన మెజార్టీ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కిశోర్ను తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తుది నిర్ణయం మాత్రం రాహుల్దేనని వ్యాఖ్యానించాయి.
అయితే, ఈ కథనాన్ని ప్రశాంత్ కిశ్ర్ సన్నిహితులు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరిక దాదాపు ఖాయమైనా.. పలు కారణాలతో ఆయన చేరలేదని ప్రియాంక గాంధీ వాద్రా గతేడాది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఎన్నికల వ్యూహకర్త పలు దఫాలుగా సమావేశమై చర్చలు జరిపారు. రాహుల్ నివాసానికి వెళ్లడంతో ఆయన చేరిక దాదాపు ఖరారైనట్టు ప్రచారం జరిగింది.
ఏం జరిగిందే తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీపై అనూహ్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ‘ఏ ఒక్కరికీ దేవుడిచ్చిన హక్కు’ కాదని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 90 శాతం మేర ఓడిపోయిందని దుయ్యబట్టారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్లేని విపక్ష కూటమి అసాధ్యమని, కానీ, ప్రస్తుతమున్న అధినాయకత్వంతో కుదరదని చెప్పారు.