హైదరాబాద్: ఏరోస్పేస్ విభాగంలో ఎందరో ఔత్సాహికులు, మరెన్నో స్టార్టప్లు, పెద్ద సంఖ్యలో ఉన్ననిపుణులైన ఇంజనీర్లు , హైదరాబాద్ను విమానయాన నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా మార్చాయని ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్ని కితాబిచ్చింది. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆ సంస్థ తెలిపింది. హైదరాబాద్లో 2015 నుంచి ఈ సంస్థ నిర్వహిస్తున్న కస్టమర్ ట్రైనింగ్ సెంటర్లో ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు శిక్షణ పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్క్ (TASK), టీ-హబ్ (T-Hub) వంటి సంస్థలతో ప్రాట్ అండ్ విట్నీ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది.
బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2022లో ప్రాట్ & విట్నీ జనరల్ మేనేజర్ అమిత్ పాఠక్ మాట్లాడుతూ, “ఈ శిక్షణా కేంద్రం 11,500 కంటే ఎక్కువ రోజుల శిక్షణను పూర్తి చేసింది, 27 దేశాలలో 39 మంది ఆపరేటర్లు శిక్షణ పొందారు. నైపుణ్యాభివృద్ధిపై భారతదేశంలోని ఐదు రాష్ట్రాలతో మేము టై అప్ అయ్యాము. అలాగే మేము వివిధ కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాము.
ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్లో సొల్యూషన్ను డెవలప్ చేయడానికి తాము టి-హబ్తో టైఅప్ అయ్యామని, ఒక స్టార్టప్ ఛాలెంజ్ని నడుపుతున్నామని పాఠక్ పేర్కొన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వివిధ స్టార్టప్ల నుండి 70కిపైగా అప్లికేషన్లను స్వీకరించాం. ఫైనల్స్ కోసం మూడు పరిష్కారాలు గుర్తించాం అని ప్రాట్ & విట్నీ జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. అయితే విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పకుండానే, “ఈ స్టార్టప్లు అభివృద్ధి చేసిన కొన్ని పరిష్కారాలను మేము మా ఇంజిన్ తనిఖీలలో ఉపయోగిస్తాము” అని పాఠక్ చెప్పారు.
బెంగళూరులో ప్రాట్ అండ్ విట్నీ సెంటర్
ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ..బెంగళూరులో ప్రపంచ స్థాయి గ్లోబల్ సైప్లె చెయిన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఆపరేషన్స్ ఎండీ సందీప్ శర్మ మాట్లాడుతూ..ఈ నూతన సెంటర్ కోసం 160 మంది ఏరోస్పెస్ అనలిస్ట్, డాటా సైంటిస్ట్లను నియమించుకున్నట్లు, ఈ సెంటర్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు. భారత్లో ఇంజిన్ ఎంఆర్వో(మెంటనెన్స్, మరమ్మత్తులు, మొత్తం) సెంటర్ ఏర్పాటుపై కంపెనీ ప్రెసిడెంట్ అశ్మితా సేతి మాట్లాడుతూ..ఈ ఎంఆర్వో సెంటర్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్లో ప్రతియేటా బిలియన్ డాలర్ల విలువైన విమాన మరమ్మత్తులు సింగపూర్, మధ్య ప్రాచ్య, హాంకాంగ్ దేశాల్లో జరుగుతున్నాయని, ఈ రంగానికి చెందిన సంస్థలకు రాయితీలు ఇస్తే ఇక్కడే ఎంఆర్వో సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్లో కస్టమర్ శిక్షణ కేంద్రం ఉన్నది.