న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక 2 రోజులు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. సోమ, మంగళవారం కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రదర్శనలు నిర్వహించనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించింది. ఫలితంగా రెండు రోజులు బ్యాంకుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండవు. ‘సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు’ అని ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులతో పాటు ఉక్కు, చమురు, టెలికం, బొగ్గు, పోస్టల్, ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి మొత్తం 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణా, రైల్వే, విద్యుత్తు సర్వీసులపై ప్రభావం పడనున్నది.
కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరిన్ని పనులు, వేతనాలు కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్లతో ఈ సమ్మె చేపట్టినట్లు తెలిపింది. రహదారులు, రవాణా, విద్యుత్తు శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. హరియాణాలో ఎస్మా ప్రయోగించే అవకాశం ఉన్నప్పటికీ ఆయా విభాగాల సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని వెల్లడించింది. సంయుక్త వేదికలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ సంఘాలు ఉన్నాయి. ఇక బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా సమ్మెకు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్.వెంకటాచలం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్లు
- కార్మిక చట్టాలకు సవరించిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.
- ప్రైవేటీకరణను ఆపాలి.
- నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ను రద్దు చేయాలి.
- గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి.
- కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి. బ్యాంకు ఉద్యోగుల సంఘం డిమాండ్లు
- బ్యాంకుల ప్రైవేటీకరణ మానుకోవాలి.
- ప్రభుత్వ బ్యాంకుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి.
- సిబ్బందికి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి
- అప్పులను వేగంగా రికవరీ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
- వినియోగదారులపై సర్వీసు చార్జిని తగ్గించాలి.