న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాద (Delhi Fire Mishap) ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. వీరంతా సజీవ దహనమైనట్లు పేర్కొన్నారు. మరో 40 మంది గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. అర్ధరాత్రి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ రెస్క్యూ సిబ్బంది పలు కార్యాలయాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
దక్షిణ దిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 60 నుంచి 70 మందిని సురక్షితంగా కాపాడారు. భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు 24 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
భవనంలో చిక్కుకున్న మరికొందరిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భవనంలోని మెుదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాల కార్యాలయంలో మొదట మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ దుకాణం యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్ లేదు. ఆ బిల్డింగ్ యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో మోటివేషన్ స్పీచ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమిదే కావొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఈ అంతస్తులో నుంచి మృతుల సంఖ్య మరింత బయటపడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు
Delhi Mundka Fire | Morning visuals from the spot where a massive fire broke out in a building yesterday, May 13
"27 people died and 12 got injured in the fire incident," said DCP Sameer Sharma, Outer District pic.twitter.com/wRErlnj3h0
— ANI (@ANI) May 14, 2022