ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. తనతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన శివసేన చర్యకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు.. డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరి 2021లో నానా పటోలే స్వీకర్ పదవికి రాజీనామా చేసినప్పటి నుండి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానం ఖాళీగా ఉందని, డిప్యూటీ స్పీకర్కు అనర్హత పిటిషన్పై తీర్పు చెప్పే అధికారం లేదని పిటిషన్ వాదించింది.
అదే సమయంలో, శివసేన న్యాయ సలహాదారుగా ఉన్న సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్, స్పీకర్ లేనప్పుడు తీర్పు చెప్పే అన్ని అధికారాలు డిప్యూటీ స్పీకర్కు ఉన్నాయని నొక్కి చెప్పారు. మరో పార్టీతో విలీనమైనప్పుడే 2/3వ వంతు మెజారిటీ అనే భావన వర్తిస్తుందని అన్నారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలా సభ్యులుగా గల వెకేషన్ బెంచ్.. ఈ పిటిషన్ను సోమవారం పరిశీలించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు కొందరు శివసేన ఎమ్మెల్యేలు. పార్టీ సీనియర్ నేత, మంత్రి ఏక్నాథ్ శిందే ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా అసోం గువాహటిలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వం నుంచి శివసేన బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు శిందే. దీనిని వ్యతిరేకిస్తున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. అసమ్మతివాదులు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారు.
ఏక్నాథ్ శిందే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత వేటు నోటీసులు జారీ చేసింది. జూన్ 27 సాయంత్రంలోగా దీనికి రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని మహారాష్ట్ర విధానసభ సచివాలయం అందులో స్పష్టం చేసింది.
తాజాగా శిందే శిబిరానికి మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఉదయ్ సామంత్ కూడా చేరుకున్నారు. ఈయన శిందే వర్గంలో చేరిన 9వ మంత్రి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన మంత్రులు నలుగురే ఉన్నారు. వారిలో ఎమ్మెల్యేగా ఉంది సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే మాత్రమే. మిగతా ముగ్గురు.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అనిల్ పరబ్, సుభాష్ దేశాయ్ ఎమ్మెల్సీలు.