గౌహతి: అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. అస్సాంలో వరద పరిస్థితి గురువారం భయంకరంగా ఉంది, గత 24 గంటల్లో ముగ్గురు పిల్లలు సహా మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు కూలి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 158 మంది చనిపోయారు. ఇప్పటికీ 28 జిల్లాల్లో వరద కొనసాగుతోంది.
33 లక్షల మంది ప్రజలు వరద బారిన పడినట్టు అస్సాం అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బార్పెట జిల్లాలో 8 లక్షల 76 వేల మంది, నాగోన్ జిల్లాలో 5 లక్షల 8వేల మంది, కామ్రూప్ జిల్లాలో 4 లక్షలమంది, క్యాచర్ జిల్లాలో 2 లక్షల 76 వేల మంది, కరీంగంజ్లో 2 లక్షల 16 వేల మంది, ధుబ్రి జిల్లాలో లక్షా 84 మంది, డర్రాంగ్ జిల్లాలో లక్షా 70 వేల మంది వరదతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు, ఆహారం అందక విలవిలలాడుతున్నారు.
మోరిగావ్ జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లోని పలు ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. వరద బాధిత ప్రజలు వానదేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇక్కడి గ్రామస్తుల పరిస్థితి తిండి, తాగునీరు లేకుండా అధ్వాన్నంగా మారింది. ప్రభుత్వ సాయం అప్పుడప్పుడు వస్తుంది. ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. మాకు పడవలు లేవు, అరటి తెప్పలపై ఆధారపడి జీవిస్తున్నాం. మాకు సహాయ సామగ్రిని సక్రమంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. వర్షాలు ఆగి వరద నీరు తగ్గుముఖం పట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’’ అని జిల్లాలోని మతిపర్బత్ గ్రామంలో వరద బాధితుడు శ్యామ్ బహదూర్ ఇండియా టుడేతో అన్నారు.
వరదల్లో మా పశువులు కొట్టుకుపోయాయి. మా ఇళ్లు దెబ్బతిన్నాయి. మాకు ప్రభుత్వం నుంచి రెండు సార్లు మాత్రమే సాయం లభించింది. మేము ప్రభుత్వం నుండి సహాయం కోసం ఎదురు చూస్తున్నాము, ”అని మోరిగావ్లోని మతిపర్బత్ గ్రామానికి చెందిన మరో వరద బాధితుడు చెప్పారు.
మోరిగావ్ జిల్లాలోని వేలాది మంది వరద బాధిత ప్రజలు జాతీయ రహదారి 37పై ఆశ్రయం పొందుతున్నారు. మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో వారు తాత్కాలిక శిబిరాల్లో ఉండవలసి రావడం ఇది రెండవ సారి. కాబట్టి ఈ రహదారి ఇప్పుడు వారి షెల్టర్ హోమ్లుగా మారింది.
వరద ముంపు ప్రాంతాల నుంచి 2 లక్షల మందికి పైగా 564 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 75 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 2వేల 542 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత వైమానిక దళం ఏడు ఎయిర్క్రాఫ్టులను మోహరించింది. 77 టన్నుల ఆహారం, నీరు ప్రజలకు వైమానిక దళం అందజేసింది. ఐదు రోజులగా 700 టన్నుల నిత్యావసరాలను అస్సాంకు వైమానిక దళం తరలించింది.
వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, అస్సాం అధికారులు పాల్గొంటున్నారు. వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం వరద ప్రభావిత జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధిత ప్రజలందరికీ తగిన పరిహారం అందేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ముఖ్యమంత్రి కోరారు.
రిలీఫ్ క్యాంపులు మరియు వాగులు, రోడ్లు మొదలైన వాటిపై స్వయంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉండే ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,800 చెల్లిస్తుందని సిఎం శర్మ తెలియజేసారు. అంతేకాకుండా, టాస్క్ఫోర్స్ ద్వారా పశువులు మరియు ఇతర నష్టాల జాబితాను సిద్ధం చేయాలని శర్మ ఆదేశించారు. సర్కిల్ ఆఫీసర్ స్థాయిలో ఏర్పాటు చేసి ఆగస్టు 7లోపు సమర్పించాలి. వరదల వల్ల స్టడీ మెటీరియల్స్ పాడైపోయిన విద్యార్థులకు ప్రభుత్వం రూ.1,000 అందజేస్తుందని చెప్పారు.
మరోవైపు వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నుండి ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం గౌహతికి చేరుకుంది.