న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ వేడి తగ్గడం లేదు. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. శివసేన పార్టీ కోసం ఉద్దవ్ ఠాక్రే, షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి. నువ్వానేనా అన్నట్లు ఉద్దవ్ ఠాక్రే, షిండే వర్గాలు తలపడుతున్నాయి. తాజాగా ఈ అంశాన్ని ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది. పార్టీ నాయకత్వ హక్కులపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపాలని పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులో ఉండగా… ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఠాక్రే వర్గం ప్రశ్నించింది. ఈక్రమంలో శివసేన సంక్షోభం మరో మలుపు తిరిగింది.
అసలైన శివసేనగా గుర్తించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బృందం దాఖలు చేసిన పిటిషన్పై ఎన్నికల కమిషన్ చర్యలకు వ్యతిరేకంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం చేసిన తాజా పిటిషన్ను ఆగస్టు 1న విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది.
కాగా, థాకరే వర్గం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఈ కేసులో విచారణపై ప్రభావం చూపే విధంగా ఎన్నికల సంఘం ముందు జరుగుతున్న విచారణలపై స్టే విధించాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.
ఎమ్మెల్యేల అనర్హత అంశం అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కారణంగా షిండే వర్గం వినతిపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కబిల్ సిబల్ వాదించారు. అనర్హత, బలపరీక్ష అన్నవి పూర్తిగా భిన్నమైన అంశాలని… పార్టీ గుర్తును తమకే కేటాయించాలని షిండే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది ఎన్కే కౌల్ ధర్మాసనానికి తెలిపారు. పోల్ ప్యానెల్ ముందు విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈసీ ఆగస్టు 8కి మాత్రమే నోటీసులు జారీ చేసిందని కౌల్ తెలిపారు.
తాజా పిటిషన్ను.. పెండింగ్లో ఉన్న వాటితో ట్యాగ్ చేసి, ఆగస్టు 1న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. మరోవంక శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపంలో తమకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. శివసేన సభ్యులు ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నారనే ఆధారాలనూ సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం వరకు డాక్యుమెంట్లు ఈసీకి సమర్పించాలని స్పష్టం చేసింది.
దీంతో శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కోరింది ఉద్ధవ్ థాక్రే వర్గం. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది థాక్రే వర్గం.