బెంగళూరు: కర్ణాటక హుబ్లీలోని ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలకు హైకోర్టు అనుమతించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన విచారణలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఈద్గా మైదాన్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతిస్తూ హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్డీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.
ఈద్గా ఆస్తి ధార్వాడ్ మునిసిపాలిటీకి చెందినదని, అంజుమన్-ఏ-ఇస్లాం సంవత్సరానికి 1 రూపాయి రుసుముతో 999 సంవత్సరాల కాలానికి లీజుదారుగా మాత్రమే ఉందని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అశోక్ ఎస్ కినాగి పేర్కొన్నారు.
హుబ్లీకి 400 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు ఈద్గా మైదాన్లో వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతి తిరస్కరించిన తర్వాత.. అంజుమన్-ఇ-ఇస్లాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మైదానంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అనుమతించకుండా హెచ్డీఎంసీని నిరోధించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 31 నుంచి మూడు రోజుల పాటు గణేష్ ఉత్సవాలకు అనుమతిస్తూ హెచ్డీఎంసీ హౌస్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయాన్ని.. పిటిషనర్ ప్రశ్నించారు.
అయితే పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి జస్టిస్ అశోక్ ఎస్ కినాగి నిరాకరించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులోని చామరాజ్పేట ఈద్గా మైదాన్ సమస్యకు… హుబ్లీ ఈద్గా మైదాన్ సమస్య భిన్నంగా ఉందని కోర్టు ప్రాథమికంగా గుర్తించింది. బెంగళూరు ఈద్గా భూమి విషయంలో యాజమాన్యంపై ‘‘తీవ్రమైన వివాదం’’ హుబ్లీ కేసులో లేదని హైకోర్టు పేర్కొంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశం వర్తించదని జస్టిస్ అశోక్ ఎస్ కినాగి అన్నారు.
1972-1992 మధ్యకాలంలో సివిల్ కోర్టులు, హుబ్లీ హైకోర్టు ద్వారా టైటిల్ను ధృవీకరించినందున… హుబ్లీ ఈద్గా మైదాన్కు హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (HDMC) సంపూర్ణ యజమాని అని కోర్టు దృవీకరించింది. చివరకు 2010లో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను సమర్థించింది. హుబ్లీ ఈద్గా మైదాన్ సమస్య, బెంగళూరులోని చామరాజపేట ఈద్గా మైదాన్ సమస్య వేరు. హుబ్లీ కేసులో స్థలం యాజమాన్యంపై తీవ్రమైన వివాదం లేదని హైకోర్టు పేర్కొంది. జస్టిస్ అశోక్ ఎస్. కినాగి నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించదని పేర్కొంది.
మరోవంక, బెంగళూరులోని ఈద్గా మైదానంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇక్కడ గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించరాదని పేర్కొంది. ఆగస్టు 30, 31 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన వేడుకలను నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు, సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్పై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సైతం నిలిపివేసింది.