కేరళ/తిరువనంతపురం: ద్వేషం, హింస, కోపంతో ఎన్నికలను గెలవవచ్చు… కానీ ఇవి దేశం ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యలను ఎంతమాత్రం పరిష్కరించలేమని, కొత్త ఉద్యోగాలు సృష్టించలేమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికార బీజేపీ ఈ విషయాన్ని నిరూపించిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో సోమవారం రెండో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ తిరువనంతపురం జిల్లాలోని వెల్లాయానీ జంక్షన్ నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో జనం ఆయన వెంట యాత్రలో పాలుపంచుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ద్వేషాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవవచ్చని, కానీ ఉపాధిని సృష్టించలేవని కాషాయ పార్టీ రుజువు చేసిందని బీజేపీపై మండిపడ్డారు.
దేశంలో మన పాలకులు ప్రజలతోపాటు ప్రసార మాధ్యమాల గొంతుక వినిపించకుండా నొక్కేస్తున్నారని. ‘ ఆరోపించారు. అందుకే నేరుగా ప్రజలతో మాట్లాడానికి జోడో యాత్ర ప్రారంభించామని తెలియజేశారు. మన దేశం, మన యువత మెరుగైన రేపటి రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోందని, ప్రతి ఉషోదయం తనతో కొత్త ఆశను, నమ్మకాన్ని నింపుతోందని రాహుల్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ‘దేశం కోసం అందరు, దేశం కోసం “ప్రతి అడుగు” అని పేర్కొన్నారు. విపక్షాల ఒక్యతకు బలమైన కాంగ్రెసే మూలస్తంభమని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ సోమవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.
రాహుల్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, కె. సుధాకరన్, సతీశన్ తదితరులు ఉన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుండి 3,570 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూ కాశ్మీర్కు చేరుకోవడానికి సెప్టెంబర్ 7 నుండి 100 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత కళాకూట్టమ్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. “భారతదేశం యొక్క కల చెదిరిపోయింది. ఆ కలను సాకారం చేయడానికి, మేము భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తున్నాము. ఇప్పటికి 100 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి అయిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కేరళలో మొదటి రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత, గాంధీ పాళయంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కేరళలోని ప్రముఖులు, మత పెద్దలను కలుసుకున్నారు, జవహర్ బాల్ మంచ్ చిత్రలేఖన పోటీలో విజేతలకు బహుమతులు పంపిణీ చేసి, అక్కడి పిల్లలతో సంభాషించారు. తిరువనంతపురం కన్నమ్మూలలో ఉన్న చట్టంపి స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు.
కజకూట్టంలో యాత్ర ముగిసిన తర్వాత, ఏఐసీసీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ భారత్ జోడో యాత్ర సరిగ్గా 100 కిలోమీటర్లు పూర్తి చేసిందని, ఇది “బిజెపిని కలవరపెట్టింది అని ట్వీట్ చేశారు. మనం నడిచే ప్రతి అడుగు మన సంకల్పాన్ని పునరుద్ధరిస్తుంది!” ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో పాదయాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా కశ్మీర్ చేరుకుంటుంది.
శనివారం సాయంత్రం కేరళలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 1న కర్ణాటకలో ప్రవేశించడానికి ముందు 19 రోజుల పాటు కేరళలోని ఏడు జిల్లాలను తాకి 450 కిలోమీటర్లు రాష్ట్రంలో సాగనుంది.