చండీగఢ్ : చండీగఢ్ యూనివర్శిటీ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియోలను షేర్ చేసిన విద్యార్థినితో పాటు ఆమె స్నేహితుడు, సిమ్లాకు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ట్రావెల్ ఏజన్సీ నిర్వహిస్తున్న సన్నీ మెహతాను కూడా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. హాస్టల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వార్డెన్ రాజ్విందర్ కౌర్ను సస్పెండ్ చేసినట్లు చండీగఢ్ యూనివర్శిటీ యాజమాన్యం తెలిపింది. నిందితురాలు వీడియోలను బయటి వ్యక్తులకు షేర్ చేసిన విషయాన్ని గుర్తించినప్పటికీ.. వార్డెన్ వెంటనే అధికారులకు సమాచారమివ్వలేదని అన్నారు. నిరసన చేపడుతున్న విద్యార్థులను ఎందుకు ఆందోళన చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.
అలాగే యూనివర్శిటీని శనివారం వరకు మూసివేయనున్నట్లు ప్రకటించింది. యూనివర్శిటీకి చెందిన హాస్టల్ విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు లీకైన ఘటనపై నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే..