న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన వివాదాస్పద మత బోధకుడు యతి నర్సింగానంద్ సరస్వతి మరోసారి నోరుపారేసున్నారు. గన్పౌడర్” ఉపయోగించి మదర్సాలను, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని కూల్చివేయాలని విద్వేష వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం, యతి నర్సింహానంద్ అలీఘర్లో హిందూ మహాసభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు లేని మదర్సాలపై కొనసాగుతున్న సర్వే గురించి ప్రస్తావిస్తూ మదర్సా వంటి సంస్ధలు ఉండరాదని, చైనా తరహాలో అన్ని మదర్సాలను గన్పౌడర్తో పేల్చివేయాలని అన్నారు. మదర్సాల్లో విద్యార్ధులందరినీ క్యాంపులకు తరలిస్తే వారి మెదళ్ల నుంచి ఖురాన్ అని పిలిచే వైరస్ను తొలగించాలని వ్యాఖ్యానించారు. యతి నర్సింగానంద్ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియో బయటకు రావడం కలకలం రేపింది.
అలీఘఢ్లో ఓ మతానికి చెందిన విద్యా సంస్ధలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్పై గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్ పేర్కొన్నారు.
విద్వేషపూరిత ప్రసంగాల కేసులో యతి నర్సింహానంద్పై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసులో గతేడాది అరెస్టయ్యాడు. ఆ తరువాత విడుదల చేశారు.
గత ఏప్రిల్లో ఢిల్లీలో జరిగిన హిందూ మహాపంచాయత్లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే 50 శాతం హిందువులు మతం మార్చుతారని, 40 శాతం మందిని చంపేస్తారని , పదిశాతం హిందువులు దేశం విడిచి వెళ్లి పోయేలా చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జులై నెలలోనూ జాతిపిత మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఒక కోటి మంది హిందువుల హత్యకు మహాత్మా గాంధీ కారకుడని యతి నర్సింగానంద్ వ్యాఖ్యానించారు.