న్యూఢిల్లీ: క్విక్ డెలివరీ స్టార్టప్ జెప్టో సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా, IIFL వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కులుగా గుర్తింపు పొందారు. ఈ ఇద్దరు కుర్రాళ్లు. అతి తక్కువ సమయంలో ఇంటికి కిరాణా, ఇతరత్రా సామాగ్రిని అందించే జెప్టో కంపెనీని వీరిద్దరు స్థాపించారు. 19 ఏళ్ల భారతీయ కుర్రాళ్లిద్దరూ స్థాపించిన సార్టప్ కంపెనీ జెప్టో రాకెట్ట్లా దూసుకుపోయింది. ఏడాదిలో ఏకంగా రూ.7వేల కోట్లకుపైగా విలువైన కంపెనీగా జెప్టో సంచనలనం సృష్టించింది. తద్వారా వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్లో బిలియనీర్ల క్లబ్లో చేరిన అత్యంత పిన్న వయస్కులయ్యారు!
యువ పారిశ్రామికవేత్తలు ఇద్దరూ హురున్ ఇండియా ఫ్యూచర్ యునికార్న్ ఇండెక్స్ 2022లో అతి పిన్న వయస్కుడైన స్టార్ట్-అప్ వ్యవస్థాపకులు. భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వోహ్రా, పాలిచాను చేరడంతో దేశంలోని స్టార్టప్లకు పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది.
తాజాగా.. 2022 ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో ఈ ఇద్దరు కుర్రాళ్లు చేరారు. కైవల్య సంపద రూ.వెయ్యి కోట్లు; అదిత్ సంపద రూ.1200 కోట్లుగా తేలింది.
కైవల్య, అదిత్లు స్టాన్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువును వదిలేసుకొని భారత్కు తిరిగి వచ్చారు. బెంగళూరులో జన్మించిన కైవల్య దుబాయ్ కాలేజీలో చదివాడు. గణితం, కంప్యూటర్ సైన్స్తో పాటు హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో నైపుణ్యముంది. అదిత్ ముంబయిలో పుట్టి పెరిగాడు. దుబాయ్లో చదివాడు. స్టాన్ఫర్డ్కు వెళ్లటానికి ముందే.. 17 ఏళ్ల వయసులోనే గోపూల్ పేరుతో.. విద్యార్థులకు కార్ల పూలింగ్ స్టార్టప్ ఆరంభించాడు. ప్రైవసీ పాలసీలకు సంబంధించిన కృత్రిమ మేధ ప్రాజెక్టు ప్రైవసీ కూడా అదిత్ సొంతం. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదవటానికి విశ్వవిఖ్యాత స్టాన్ఫర్డ్ కాలేజీకి వెళ్లారు. కానీ కరోనా లాక్డౌన్ వేళ తట్టిన ఐడియా.. వారి జీవితాన్నే మలుపు తిప్పింది. స్టాన్ఫర్డ్ చదువుకు మధ్యలోనే ఫుల్స్టాప్ పెట్టి డ్రాపౌట్లుగా మారారు.
దుబాయ్లో పెరిగిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు, ముంబైలోని స్థానిక దుకాణాల నుండి కిరాణా వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ కిరానాకార్ట్ అనే స్టార్టప్ను మొదట ప్రారంభించారు. ఇది జూన్ 2020 నుండి మార్చి 2021 వరకు పనిచేసింది. తర్వాత వారు ఏప్రిల్ 2021లో Zeptoని ప్రారంభించారు.
2021 ఏప్రిల్లో ముంబయిలో రూ.485.3 కోట్ల ఆరంభ ఫండింగ్ను ఆకర్షించి కార్యకలాపాలు ఆరంభించిన కంపెనీ ఇప్పుడు పదికిపైగా పట్టణాల్లో సుమారు 1500 మంది సిబ్బందితో విస్తరించి సేవలందిస్తోంది. ఈ కుర్రాళ్లిద్దరి చొరవ, ఆలోచన శక్తి, ప్రజల అవసరాలు తీరుస్తున్న వైనాన్ని చూసి.. జెప్టో స్టార్టప్లో నెల తిరిగే సరికి మరో రూ.800 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది మేలో రూ.1617 కోట్లు వచ్చాయి. తద్వారా.. కంపెనీ విలువ రూ.7వేల కోట్లకుపైగా చేరింది. కిరాణా సామగ్రితో పాటు కాఫీ, టీ, చిరుతిళ్లులాంటివి కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.