న్యూఢిల్లీ: శివసేన గుర్తు అయిన ‘‘విల్లు – బాణం’’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఈసీ… మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండేలకు రెండు రోజుల క్రితం షాకిచ్చింది. ముంబైలోని ఈస్ట్ అంధేరి నియోజకవర్గానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరగనున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో ఉద్ధవ్ ఠాక్రే, ఆయన ప్రత్యర్థి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోని రెండు వర్గాలకు ఉప ఎన్నిక కోసం సోమవారం కొత్త పేర్లు, గుర్తులు కేటాయించారు. “అసలు” శివసేన ఎవరిది అన్న దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎన్నికల కమిషన్ ఆదేశం అమల్లో ఉంటుంది.
ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రేగా ఉంటుంది. ఆ పార్టీ చిహ్నం మషాల్ (కాగడా)ను కేటాయించారు. ఏక్నాథ్ షిండే బృందాన్ని బాలాసాహెబంచి శివసేన (బాలాసాహెబ్ యొక్క శివసేన) అని పిలుస్తారు. కొత్త ఎన్నికల గుర్తు ఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు ‘త్రిశూలం’, ‘గద’ గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది. ఇవి మతపరమైన గుర్తులను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో వాటిని పక్కనబెట్టినట్లు ఈసీ స్పష్టం చేసింది.
‘శివసేన’ పేరు, ఆ పార్టీ గుర్తు అయిన ధనస్సు-బాణంను ఎలక్షన్ కమిషన్ను స్తంభింపచేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కొత్త పేర్లు, పార్టీకి గుర్తులకు సంబంధించి ఐచ్ఛికాలు సమర్పించాలని ఇదివరకే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఇరు పార్టీ ఇరువర్గాలు తమకు కేటాయించాల్సిన గుర్తులపై ఐచ్ఛికాలను ఈసీకి సమర్పించాయి. త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆదివారం కోరింది. శిందే వర్గం సైతం తమ ఐచ్ఛికాలను సమర్పించినట్లు ఈసీ అధికారులు తెలిపారు.
ముంబైలోని అంధేరి (తూర్పు) నియోజకవర్గంలో నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో థాకరే నేతృత్వంలోని వర్గం ఈ గుర్తును ఉపయోగించకూడదని డిమాండ్ చేస్తూ షిండే గురువారం ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు.
ఆ పార్టీ గుర్తు అయిన ధనస్సు-బాణంను ఎలక్షన్ కమిషన్ను స్తంభింపచేయడాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు, నిర్ణయానికి ముందు తన వర్గం వాదనలు అసలు వినలేదని వాదించారు, ఇది “సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం” అని ఆయన అన్నారు.
ఎన్నికల కమీషన్ చిహ్నాన్ని స్తంభింపజేయడం దురుద్దేశంతో కూడుకుంది అని ఉద్ధవ్ అన్నారు. అసలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని గ్రూప్ నుండి ఏ అభ్యర్థి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు” అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
కొత్త పేర్లపై ఠాక్రే వర్గం సంతృప్తి
“మాకు అత్యంత ముఖ్యమైన మూడు పేర్లు – ఉద్ధవ్ జీ, బాలాసాహెబ్, థాకరే – కొత్త పేరులో ఉంచినందుకు మేము సంతోషిస్తున్నాము” అని థాకరే విధేయుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి భాస్కర్ జాదవ్ అన్నారు. తమ వర్గానికి ఎన్నికల సంఘం ఎంపిక అంగీకారమేనని షిండే శిబిరం ప్రకటించింది.
“ఇది శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరే యొక్క బలమైన హిందుత్వ దృక్పథాలకు దక్కిన విజయం. బాలాసాహెబ్ ఆలోచనలకు మేము వారసులం” అని ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు.
జూన్లో షిండే నేతృత్వంలోని 48 మంది ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా బిజెపి మద్దతుతో తిరుగుబాటు చేసి, సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి… కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
శివసేన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది షిండే వర్గంలో చేరటంతో సీఎంగా రాజీనామా చేసిన ఉద్ధవ్ థాకరే, తన తండ్రి బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కోసం పోరాడుతున్నారు.