తిరువనంతపురం: న్యాయం ఆలస్యం అయితే అన్యాయం జరిగినట్లేనని న్యాయకోవిదులు తరచూ ఉదహరిస్తూ ఉంటారు. కోర్టులో విచారణ త్వరితగతిన జరగకపోతే కక్షిదారులకు కూడా న్యాయం జరగదు. కోర్టుల్లో కేసులు ఏళ్లతరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్ కేసులు 4.4 కోట్లు ఉన్నట్టుగా నివేదికలు చెపుతున్నాయి. రకరకాల కారణాలతో వాయిదాల పడుతూ … విచారణ ఏళ్ల తరబడి సాగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ కేరళలో చోటుచేసుకున్న ఉదంతమే…
కోర్టులో న్యాయం దొరకటం ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ, ఈరోజు ఓ వ్యక్తి కేరళ హైకోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే, కోర్టు భద్రతా సిబ్బంది సకాలంలో జోక్యం చేసుకోవడంతో అతని ప్రాణాలు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే… కేరళలోని చిత్తూర్కు చెందిన మిను ఆంటోని తన మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఎర్నాకులంలోని ఫ్యామిలీ కోర్టు కోరింది. ఈ ఉత్తర్వుపై ఆయన హైకోర్టులో అప్పీలు దాఖలు చేసినప్పటికీ, ఆ అప్పీలు విచారణకు రావడానికి చాలా సమయం పట్టింది. కేసు విచారణలో జాప్యంపై ఆయన బాగా కలత చెందారు. ఏడో అంతస్తులోని బాల్కనీ రెయిలింగ్పై దూకేందుకు సిద్ధమయ్యారు. దీన్ని అక్కడి పోలీసు సిబ్బంది గమనించారు. వారు అతనిని వెనుక నుండి సమీపించి పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు.