హైదరాబాద్: గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాషాయ పార్టీ ప్రచారం చేస్తున్న డబుల్ ఇంజన్ పాలన అంతా మాటలకే పరిమితమైంది. నాణేనికి మరోవైపు గుజరాత్లోని కొన్ని గ్రామాలు ప్రాథమిక సౌకర్యాలు, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల లేమితో అల్లాడుతున్నాయి. రైతులకు పంట బీమా సైతం సరిగ్గా అందడంలేదు. దీంత తమ డిమాండ్లను సాధించుకోవడానికి రాబోయే ఎన్నికలను బహిష్కరించాలని గుజరాత్ గ్రామాలు నిర్ణయించుకున్నాయి.
గతంలో ఎన్నికలను బహిష్కరించిన గ్రామాల జాబితాలో అహ్మదాబాద్లోని నానా చిలోడా గ్రామం కూడా చేరింది. కనీసం మౌలిక వసతులను కల్పించని గుజరాత్ ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులు వీధుల్లో పోస్టర్లు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రెండు సంవత్సరాల క్రితం, నానా చిలోడా గ్రామాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు.
అయినప్పటికీ, అక్కడి ప్రజలకు ఇప్పటికీ తగినంత తాగునీరు, పాఠశాల భవనాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ‘నానా చిలోడా’ ప్రజల అభ్యర్థనలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎటువంటి స్పందన కనిపించలేదని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. పనుల అమలులో జాప్యం కారణంగా ఏర్పడిన అసౌకర్యాన్ని స్థానిక నాయకులు అంగీకరించటం ఆసక్తికరంగా మారింది. అధికారుల ఉదాసీనతతో విసిగిపోయిన గ్రామస్థులు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
గుజరాత్లో ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదు. బిజెపి పాలిత గుజరాత్లో స్థానిక సంస్థలు సహా అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికల్లో గ్రామాలు ఎన్నికలను బహిష్కరించడం ఒక సాధారణ అంశంగా మారింది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, మోర్బి జిల్లాలోని గజాడి గ్రామం నీటి కొరత కారణంగా డిసెంబర్లో మొదటి దశ పోలింగ్ను బహిష్కరించింది. అదేవిధంగా, 2019 లోక్సభ ఎన్నికలలో కూడా జామ్నగర్ జిల్లాలోని భాంగోర్, డాంగ్ జిల్లాలోని దావ్దహాద్ గ్రామాలు వేర్వేరు కారణాల వల్ల ఎన్నికలను బహిష్కరించారు.
పంట బీమా చెల్లించకపోవడం, ల్యాండ్ మ్యాపింగ్లో తేడాలు రావడంతో భాంగోర్ గ్రామస్తులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. గ్రామంలో రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దావదాహడ్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అప్పట్లో కచ్ జిల్లా నందా గ్రామంలో కేవలం ఓటు మాత్రమే నమోదైనట్లు సమాచారం.
ఎన్నికల సంఘం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించడంతో, ఈసారి ఎన్ని గ్రామాలు ఎన్నికలను బహిష్కరిస్తాయో, ఏయే డిమాండ్లు చేస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటితో సహా అభివృద్ధి కార్యకలాపాలు, పారిశుధ్యం,ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంటున్న సమయంలో గుజరాత్లో ఎన్నికలను బహిష్కరించడం విశేషం. ఈ సంవత్సరం, స్వచ్ఛ భారత్ మిషన్ (SBM-G) కింద పెద్ద రాష్ట్రాల విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. సౌత్ జోన్లోని ఓవరాల్ టాప్ జిల్లాల విభాగంలో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు వరుసగా మొదటి రెండు స్థానాలతో సహా 12 అవార్డులను మన రాష్ట్రం కైవసం చేసుకుంది.
ఇది కాకుండా, స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో 16 మునిసిపాలిటీలు అవార్డులు గెలుచుకున్నాయి. అలంపూర్ మునిసిపాలిటీ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, కోరుట్ల మున్సిపాలిటీతో సహా మరో మూడు పట్టణ స్థానిక సంస్థలు ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ISL) కింద అవార్డులు పొందాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంది. తెలంగాణలో ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ లాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాషాయ పార్టీ ప్రచారం చేస్తున్న డబుల్ ఇంజన్ పాలనలో మాత్రం కానరావు.