న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై…కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి హేమంత్ గుప్తాకు అత్యున్నత పదవి ఏరికోరి వరించింది. ఆయాన్ని న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎన్డిఐఎసి) చైర్పర్సన్గా నియమిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్డిఐఎసి చైర్పర్సన్గా జస్టిస్ హేమంత్ గుప్తా (రిటైర్డ్), పార్ట్టైమ్ సభ్యులుగా గణేష్ చంద్రు, అనంత్ విజయ్ పల్లి నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
సుప్రీంకోర్ట్ నుంచి అక్టోబర్ 14న పదవీ విరమణ చేసిన జస్టిస్ గుప్తా, విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు మార్చి 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల బ్యాచ్పై విభజన తీర్పును వెలువరించిన ధర్మాసనంలో సభ్యునిగా ఉన్నారు.
ఆ సమయంలో హిజాబ్పై నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ గుప్తా కొట్టివేశారు. అయితే విద్యార్థులకు హిజాబ్ ధరించే హక్కు ఉందని జస్టిస్ గుప్తాతో ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియా విభేదించారు. జస్టిస్ గుప్తా నవంబర్ 2, 2018న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
పంజాబ్ – హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జితేందర్ వీర్ గుప్తా కుమారుడు. జస్టిస్ గుప్తా అక్టోబర్ 17, 1957లో జన్మించారు. జూలై 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆయన 1997 నుండి 1999 వరకు పంజాబ్ అదనపు అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు.
జూలై 2, 2002న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గుప్తా 10 సంవత్సరాలకు పైగా పంజాబ్ – హర్యానా హైకోర్టు కంప్యూటర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ కాలంలో హైకోర్టు పూర్తి కంప్యూటరీకరణను చూసింది, ఇందులో న్యాయపరమైన ఫైల్ల మొత్తం రికార్డులను డిజిటలైజేషన్ చేశారు. తాజాగా దాఖలు చేసిన వాటిని స్కాన్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కేసు, కేసు నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టడం, ఇ-డైరీని ప్రారంభించడం మొదలైనవి ఆధునిక పనుల్ని చేపట్టారు.
2016 ఫిబ్రవరి 8న పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అక్టోబర్ 29, 2016న ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గుప్తా 2017 మార్చి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.