23.7 C
Hyderabad
Monday, September 30, 2024

బీహార్ జర్నలిస్టు ట్వీట్ చేసిన వీడియో నకిలీది… తమిళనాడు పోలీసులు!

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడులోని బీహార్ కార్మికులపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆ రాష్ట్రానికి చెందిన ఓ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో… వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.  అది నకిలీ వీడియో అని ఆ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ బీహార్ జర్నలిస్ట్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

రాష్ట్రంలోని వలస కార్మికులపై దాడులు చేస్తున్నారని జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని నిరోధించే మార్గదర్శకాలను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన మర్నాడే పోలీసులు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

నకిలీ వార్తలు, వీడియోలతో వలస కార్మికుల్లో భయాన్ని కలిగించి, వారిని తమిళనాడు నుంచి వెళ్లగొట్టడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే దీనిపై ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వీడియోలు నకిలీవి, తప్పుదారి పట్టించేవి అని పేర్కొన్నారు. బీహార్ డీజీపీ తమిళనాడు డీజీపీతో మాట్లాడారు. బీహార్ పోలీస్‌లోని ఇతర సీనియర్ అధికారులు తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులతో టచ్‌లో ఉన్నారని పాట్నా ఏడీజీ (హెడ్‌క్వార్టర్స్) జేఎస్ గంగ్వార్ తెలిపారు. కొన్ని పాత వ్యక్తిగత వివాదాల వీడియోలు చిత్రీకరించారని పేర్కొన్నారు.

తనను తాను జర్నలిస్ట్‌గా చెప్పుకుంటూ మనీశ్ కశ్యప్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఓ నకిలీ వీడియోను పోస్ట్ చేశాడు. ముఖానికి బ్యాండ్ వేసుకుని ఉన్న ఓ వ్యక్తి తనపై దాడి జరగడంతోనే భయపడి తమిళనాడు నుంచి వచ్చేశానని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. మాట్లాడటానికి ముందు అతడు నవ్వడం వినిపిస్తోంది. ఈ ట్వీట్‌ను బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ట్యాగ్ చేశాడు.

తాజాగా, ఈ వీడియోపై స్పందించిన తమిళనాడు పోలీసులు.. తమ రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరగలేదని పేర్కొంది. ‘‘ఎప్పుడూ, ఎవ్వర్నీ మోసం చేయలేరు.. దయచేసి ఈ వీడియో చూడండి…. తమిళనాడులో ఈ ఘటన జరగలేదు.. ఇది పూర్తిగా కల్పితం.. దయచేసి నిజం తెలుసుకుని ట్వీట్ చేయండి.. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని పోలీసులు హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే….

వలస కార్మికుల్లోని రెండు గ్రూపుల మధ్య జరిగిన హింసాకాండకు సంబంధించిన వీడియో క్లిప్‌ను…  వలస కార్మికులపై దాడిగా ప్రచారం చేయడం.. అనంతరం బిహార్‌కు చెందిన చాలా మంది కార్మికులు తమ సొంత రాష్ట్రానికి బయలుదేరడానికి రైల్వే స్టేషన్‌లలో వేచి ఉండటంతో తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయనే పుకార్లు. నకిలీ వార్తలు రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశాయి. దీనిపై అధికారులు త్వరితగతిన జోక్యం చేసుకోవడం విషయం కొలిక్కి వచ్చింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles