హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ప్రధాని నరేంద్ర మోదీ ‘నియంతృత్వ’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం నరేంద్ర మోదీ అహంకారానికి, నియంతృత్వ వైఖరికి పరాకాష్ట అని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధ సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్ ను సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని ఆవేదన చెందారు. ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్న కేసీఆర్… దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని కోరారు.
Statement of CM Sri KCR on the disqualification of Congress MP @RahulGandhi from Lok Sabha:
“Sri Rahul Gandhi’s disqualification is an attack on Democratic principles and Constitutional values of India. It reflects the autocratic and egoistic personality of Sri @narendramodi.” pic.twitter.com/vJvMOWYCbM
— Telangana CMO (@TelanganaCMO) March 24, 2023