నల్గొండ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వృద్ధిని వికేంద్రీకరించే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నల్గొండలో ఐటీ హబ్ను నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన త్రీడీ మంత్రం – డిజిటైజ్, డీకార్బనైజ్, వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకువస్తోంది. ప్రతిపాదిత ఐటీ హబ్ భవన నిర్మాణ పనులు జులై నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త ఐటీ హబ్.. ఐటీ కంపెనీల అవసరాలను తీర్చనున్నాయి. నైపుణ్యం కలిగిన స్థానిక యువతకు ఉపాధిని కల్పించనున్నాయి. అంతేకాదు ఇతర రంగాల వారికి పరోక్ష ఉపాధిని అందిస్తుంది. దీంతో నల్గొండ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయం. నల్గొండ ఐటీ హబ్ను రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించే అవకాశం లేకపోలేదు.
టైర్-2 నగరాలు, పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా నల్గొండలో ఐటీ హబ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. నల్గొండలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సమాచార సాంకేతిక శాఖ మంత్రి కెటి రామారావు ఆమోదం తెలిపారు.
తొలిదశలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు రెండేళ్ల క్రితం అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్లకు చెందిన పలు ఐటీ కంపెనీల అధిపతులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఎన్నారై పెట్టుబడిదారులు నల్గొండలోని ఐటీ హబ్లో పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు.
ఐటీ మంత్రి సైతం నల్గొండలో ఐటీ హబ్ను ప్రకటించి భవనాల కోసం రూ.74 కోట్లు కేటాయించారు. ప్రతిపాదిత ఐటీ హబ్ వల్ల ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఐటీ హబ్లో టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు.