హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు టీఎస్ఆర్టీసీ ఓ బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ ఆర్టీసీ బస్సులోనైనా టెన్త్ విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఐతే ప్రయాణ సమయంలో విద్యార్ధులు తప్పనిసరిగా హాల్ టికెట్లు చూపించాల్సి ఉంటుంది. పరీక్ష అనంతరం కూడా పరీక్షా కేంద్రం నుంచి గమ్యస్థానానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు ఎస్ఎస్సి పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 2,652 కేంద్రాల్లో 4,94,458 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పరీఉక్షా కేంద్రాలకు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అటువంటి విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి, వారి ఇళ్లకు తిరిగి రావడానికి, పరీక్షలు జరిగినన్న రోజులు, ఆయా సమయాల్లో ఎక్కువ సంఖ్యలో బస్సు సర్వీసులను నడపాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ కాలనీలను కలుపుతూ అన్ని పల్లెవెలుగు బస్సు సర్వీసులను పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారులు ఇప్పటికే పరీక్షా కేంద్రాల జాబితాను, ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాల్సిన రూట్ల వివరాలను ఆర్టీసీ రీజనల్, డిపో మేనేజర్లకు అందజేయడం ప్రారంభించారు.
దీని ప్రకారం, విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి, మధ్యాహ్నం 12.30 తర్వాత కేంద్రాల నుండి తిరుగు ప్రయాణాలకు వీలుగా అవసరమైన సంఖ్యలో బస్సులు లేదా ట్రిప్పులను నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.
“రాష్ట్రంలో అన్ని పరీక్షా కేంద్రాల్లో ఉచితబస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థి తమ నివాసాలకు సమీపంలోని స్టాప్ నుండి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్ పాస్తో సంబంధం లేకుండా పరీక్ష హాల్ టిక్కెట్ చూపితే సరిపోతుందని టిఎస్ఆర్టిసి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
విద్యార్థికి ఎటువంటి ఉచిత లేదా రాయితీ బస్ పాస్ లేకుంటే, సర్వీస్ కండక్టర్ సాధారణ ఛార్జీని వసూలు చేసి టికెట్ జారీ చేస్తారని అధికారి తెలిపారు.
ఇక విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పరీక్షా కాలంలో మాత్రమే అనుమతిస్తామని, సెలవు రోజున పరీక్ష జరిగినా అనుమతిస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షల సమయంలో విద్యార్థుల బస్ పాస్లతో పాటు హాల్ టిక్కెట్లతో కూడిన కాంబి టికెట్తో ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ప్రయాణించడానికి విద్యార్థులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.