ముంబై : మహారాష్ట్రలో విద్వేష ప్రసంగం చేసినందుకు రాజా సింగ్పై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. జనవరి 29న ముంబైలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్పై గ్రేటర్ ముంబై పోలీసులు దాదర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. రాజా సింగ్పై IPC సెక్షన్ 153-A (1) (a) కింద కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య శతృత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
సకల్ హిందూ సమాజ్ జనవరి 29న ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముంబై పోలీసుల అనుమతిని కోరింది. మహిళలను భద్రత, గౌరవానికి ఆటంకం కలిగించే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శివాజీ పార్క్ నుండి దాదర్లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
ర్యాలీలో రాజా సింగ్ దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో అతను ‘లవ్-జిహాద్’ గురించి మాట్లాడినట్టు తేలింది. “ఇది హిందూ సమాజం కలిసి ఒక సంఘం ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం. మన అక్కలు, చెళ్లెళ్లు, కుమార్తెలు ఒక సంఘం యొక్క ఈ వ్యవస్థీకృత పథకాలకు బలి అవుతున్నారు’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్పై బయట ఉన్నారు.