హైదరాబాద్: ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన రైల్వే కోచ్ఫ్యాక్టరీ సాధించడంలో విఫలమైన నలుగురు బీజేపీ ఎంపీలను ‘వెన్నముకలేని’ వారుగా కేటీఆర్ ఎద్దేవా చేశారు.
దీనికి రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ. 20వేల కోట్లు ఇచ్చారు. ‘గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితం’ అంటూ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు మంత్రి కేటీఆర్.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక రాసిన కథనాన్ని ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.
4 Spineless BJP MPs from Telangana should be held accountable on Modi Govt’s outrageous flouting of AP Reorganisation Act promises
While Telangana is denied Coach Factory, PM’s home state Gujarat gets a ₹20,000 Crore locomotive coach factory!
గుజరాతీ బాసుల చెప్పులు మోసే… pic.twitter.com/6srE7gdE1E
— KTR (@KTRBRS) March 30, 2023
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 ఏప్రిల్ 2022న దాహోద్లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. దాహోద్ యూనిట్ గుజరాత్లోని మొదటి, భారతదేశంలో నాల్గవ రైల్వే తయారీ యూనిట్. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టర్మరిక్ బోర్డు మంజూరు చేయబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో స్పష్టం చేసింది.
తెలంగాణకు ఏదీ ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం చెబుతోందన్న కేటీఆర్.. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేదన్నట్టుగా ఉందని అన్నారు. అలాంటప్పుడు ఇక్కడి ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణలో ఇలాంటి దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని నిలదీశారు.
అలాగేపసుపు బోర్డు, మెట్రో రెండో దశ నిధులపై ప్రశ్నించారు. ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.