హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2,710 కోట్ల రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం శిల్పారామంలో జరిగిన ఫెడరేషన్ 10వ జనరల్ బాడీ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈ దయాకర్ రావు మాట్లాడుతూ… తెలంగాణ స్త్రీ నిధి సమాఖ్య ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. స్త్రీ నిధి సేవలు, కార్యకలాపాలను పరిశీలించిన రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు మన స్త్రీ నిధిని అమలు చేస్తున్నాయని అన్నారు.
గత 12 ఏళ్ల నుంచి స్త్రీ నిధి సమర్థవంతంగా పనిచేస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో 1.59 లక్షల స్వయం సహాయక సంఘాల నుంచి 5.3 లక్షల మంది సభ్యులు వివిధ ప్రాజెక్టుల కోసం రుణాలు పొందారని మంత్రి తెలిపారు.
మండల సమాఖ్య పదవీకాలాన్ని ప్రస్తుతం ఉన్న ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించాలని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. SHG సభ్యులు మరణిస్తే వారికి 5 లక్షల బీమా కవరేజీని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా స్త్రీ నిధి కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు అధికారులు, ఉద్యోగులకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు.ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, స్త్రీ నిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఏపీ మాస్ అధ్యక్షులు సీఎస్ రెడ్డి, స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, స్త్రీ నిధి ఉపాధ్యక్షులు రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, మేనేజింగ్ కమిటీ సభ్యులు, డీఆర్డీవోలు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.